మెదక్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఉండడానికి ఇల్లులేదు. పూరి గుడిసెలోనే జీవనం. జీవనోపాధి కోసం దుబాయ్కి పోయాడు. అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలని అనుకున్నాడు. అప్పుడు కనిపించిన ఒకే ఒక ఆశాకిరణం ఉన్న ఎకరం భూమి. అందులో వ్యవసాయం చేయాలంటే సాగునీళ్లు కావాలి. అందుకోసం ముందు ఒక బోరు వేశాడు. అందులో నీళ్లురాలేదు. మరో బోరు వేశాడు.. అందులోనూ నీళ్లు రాలేదు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదకొండు బోర్లు వేశాడు. దుబాయ్ సంపాదనతో పాటు బయటి నుంచి అప్పుగా తెచ్చిన డబ్బులన్నీ బోర్లలోనే పోశాడు. కొద్ది కొద్దిగా పోస్తున్న నీటి కంటే కుప్పలుగా పేరుకుపోయిన అప్పులే ఎక్కువగా కనిపించాయి. ఉన్న ఎకరానికి తోడు మరో ఎకరం కౌలుకు తీసుకుని సాగుచేసినా.. దిగుబడి కలిసి రాలేదు. దిక్కుతోచని స్థితిలో పొలం వద్దనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్ జిల్లా చేగుంట మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన కుర్మ స్వామి(30) జీవనోపాధి కోసం దుబాయ్కి వెళ్లాడు. అక్కడ అనుకోని ప్రమాదం ఆయన్ను ఇంటికి రప్పించింది. భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి ఊర్లోనే ఉండాలనుకున్నాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో, పూరి గుడిసె వేసుకున్నారు. స్వామికి ఎకరం లావుణి పట్టా భూమి ఉంది. దాని పక్కన ఉన్న మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఈ భూమిలో పంటలకు సాగునీళ్ల కోసం.. ఉన్న ఎకరంలోనే బోరు వేయించాడు. నీళ్లు రాలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అదే పరిస్థితి. ఇలా మొత్తం ఎకరం పొలంలో పదకొండు బోర్లు వేశాడు.
బోర్లకు సుమారు రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ఆగి ఆగి సన్నగా పోస్తున్న బోరు నీటి పంటలకు నీళ్లందలేదు. దీంతో పంటలు ఎండిపోయాయి. కౌలు పైసలతో పాటు పెట్టుబడి కూడా మీద పడింది. ప్రతి రోజూ ఎండిపోతున్న పొలాన్ని చూస్తూ కుమిలిపోయేవాడు. పేరుకుపోయిన అప్పులను తలచుకొని కుర్మస్వామి పూర్తిగా కుంగిపోయాడు. రోజూ మాదిరిగానే మార్చి 11న సాయంత్రం పొలానికి వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఉదయం వరకూ స్వామి ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న స్వామి కానరానిలోకాలకు వెళ్లడంతో భార్యాపిల్లలు భోరుమన్నారు. కుటుంబానికి ఉన్న ఒక్క ఆధారం దూరమవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.
కుటుంబంవైపు కన్నెత్తిచూడని సర్కార్
బోర్లు వేసి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న కుర్మ స్వామి కుటుంబంవైపు రాష్ట్ర ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుర్మ స్వామి కుటుంబాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కనీసం పరామర్శించలేదు. వయసుపైబడిన తల్లిదండ్రులు, భార్యా,పిల్లలు స్వామి మరణంతో దిక్కులేని వారయ్యారు.
గుడిసెలోనే జీవనం
కిష్టాపూర్కు చెందిన కుర్మ స్వామికి కనీసం ఉండడగానికి ఇళ్లు కూడా లేదు. ప్లాస్టిక్ కవర్లతో ఉన్న గుడిసెలోనే స్వామి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు నివసిస్తున్నారు. కుర్మస్వామి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.