హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్కు తాకి ఏనుగులు మృతి చెందినట్టు స్థానికులు పేర్కొన్నారు. ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు కొంతకాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు సమీపంలోని తువ్వకొండవైపు వెళ్లిపోయాయని స్థానికులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు, సప్పానికుంటలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతిచెందారు. మల్లనూరులో ఉష అనే మహిళ రైల్వేస్టేషన్కు వెళ్తుండగా, సప్నానికుంటలో శివలింగం అనే రైతు పొలం నుంచి వస్తుండగా ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఘటనాస్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు.