హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. గురువారం రాత్రి నుంచి సమ్మె మొదలు కావడంతో పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. మరికొన్ని పాక్షికంగా నడుస్తున్నాయి. శుక్రవారం నాటికి సుమారు 1000 మెగావాట్లకుపైగా విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.
పలు పవర్ ప్లాంట్ల మూత
ఆలిండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఛైర్మన్ శైలేంద్ర దూబే నేతృత్వంలోని నేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) చేపట్టిన ఈ సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ నుంచి ఏఐపీఎఫ్ జనరల్ సెక్రెటరీ రత్నాకర్రావు నేతృత్వంలో పలువురు ప్రతినిధులు యూపీ విద్యుత్తు ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. సమ్మె వల్ల ఓబ్రాలో 400 మెగావాట్లు, అన్పారాలో 420 మెగావాట్లు, పరిచ్ఛాలో 210 మెగావాట్ల ప్లాంట్లను మూసి వేయాల్సి వచ్చింది. దీంతో ఓబ్రాలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులతో 16 గంటలు పని చేయించడానికి యాజమాన్యం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదే పరిస్థితి మిగతా థర్మల్ ప్లాంట్లలోనూ నెలకొనడంతో తక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ నుంచి భారీగా ఇంజనీర్లను డిప్యూటేషన్పై రాష్ర్టానికి తరలించే ప్రయత్నం చేసింది. పరిచ్ఛాలో స్థానిక ఇంజనీర్లతోపాటు ఎన్టీపీసీ నుంచి డిప్యూటేషన్పై వచ్చిన ఇంజనీర్లు కూడా విధులను బహిష్కరించారు. హార్దా గంజ్లోని 660 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రంలో పనిచేయడానికి వచ్చిన ఎన్టీపీసీ ఇంజనీర్లను స్థానిక ఉద్యోగులు ప్రతిఘటించారు. ఒక్క పూర్వాంచల్ డిస్కం పరిధిలోనే 75 ఫీడర్ల ద్వారా విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
ప్రైవేటీకరణ చర్యలు మానుకోకపోతే దేశవ్యాప్త సమ్మె
కేంద్ర, యూపీ ప్రభుత్వాలు విద్యుత్తు ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయకపోతే దేశ వ్యాప్త సమ్మెగా మారుతుందని ఎన్సీసీఓఈఈఈ ఛైర్మన్ శైలేంద్ర దూబే ప్రభుత్వాలను హెచ్చరించారు. ఇప్పటికే యూపీ విద్యుత్తు యాజమాన్యాలు తమ ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తే పరిస్థితి మరింత క్లిష్టతరమవుతుందని ఏఐపీఎఫ్ జనరల్ సెక్రెటరీ జనరల్ సెక్రటరీ రత్నాకర్రావు పేర్కొన్నారు. ఎన్టీపీసీ నుంచి భారీ సంఖ్యలో ఇంజినీర్లను డిప్యూటేషన్ పంపించడంపై ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. దీనిపై ఎన్టీపీసీ సీఎండీకి లేఖ రాసింది. మొత్తానికి కేంద్రం, యూపీ దుర్మార్గంగా విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు ప్రయత్నించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.