Mulugu | కన్నాయిగూడెం, మార్చి 22 : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో విద్యుత్తు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. శుక్రవారం గూర్రేవుల రామాలయం సమీపంలోని ప్రధాన రహదారిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ ఉదయం 9 గంటల ప్రాంతంలో కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ‘ఇప్పుడు ఫ్యూజ్ మార్చడం కుదరదు. మంత్రి పర్యటన ముగిసే వరకు వేచి ఉండాలి’ బదులిచ్చారు.
దీంతో చేసేదేమీలేక సీతక్క పర్యటనను అడ్డుకుంటామని వాడలోని వారు ‘నమస్తే తెలంగాణ’ విలేకరికి తెలిపారు. ఇదే విషయాన్ని ఆ విలేకరి ఏఈ స్వామి దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించి లైన్మెన్, జూనియర్ లైన్మెన్లను పంపించగా కరెంటును బంద్ చేయకుండానే కర్ర సహాయంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్యూజ్ వేశారు. దీంతో గ్రామస్థులు ‘నమస్తే తెలంగాణ’ విలేకరికి కృతజ్ఞతలు తెలిపారు.