హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గృహ (క్యాటగిరీ-1), గృహేతర (క్యాటగిరీ-2) విద్యుత్తు సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు (పేరు మార్పు) ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఆఫీసుకు రాకుండానే వారంలోనే ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. గుర్తింపు కార్డు, రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్పై ధ్రువీకరణ, ప్రస్తుత దరఖాస్తుదారుని పేరుమీద స్వీయ ధ్రువీకరణ లేదా రిజిస్టర్డ్ డీడ్, విల్ డీడ్లో ఏదైనా యాజమాన్య హక్కు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. గృహేతర కనెక్షన్ కోసమైతే.. కంపెనీ అధికారపత్రం, ఉమ్మడి యాజమాన్యం ఉంటే రూ.10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్పై ఒప్పందం, పాత యజమాని చనిపోతే లీగల్ హైర్ సర్టిఫికెట్ పొందుపరచాలన్నారు.