విపత్కర సమయాలు.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్తు గ్రిడ్ వైఫల్యం చెందితే పరిస్థితి ఏమిటి? ఉత్పత్తికి, డిమాండ్కు మధ్య భారీ తేడా ఏర్పడితే ఎలా? గ్రిడ్ ఫెయిల్యూర్ అయితే ముఖ్యమైన కార్యాలయాలు, ప్రాంతాలూ కరెంటు లేకుండా చీకట్లో మగ్గిపోవాల్సిందేనా..? అలాంటి దానికి ఇకపై అవకాశం లేదంటున్నారు విద్యుత్తుశాఖ అధికారులు. వారి భరోసాకు కారణం.. ‘విద్యుత్తు ఐలాండ్’. రాష్ట్రం మొత్తం లేకపోయినా.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం విద్యుత్తు ఉండేలా ఈ పవర్ ఐలాండ్ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రిడ్ వైఫల్యం వల్ల 2012లో ఉత్తర భారతావని మొత్తం కొద్దిరోజులపాటు చీకట్లో ఉండిపోయింది. ఇలాంటి సమయంలో అత్యం త ముఖ్యమైన కార్యాలయాలు, రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్తు లేక చీకట్లు అలుముకున్నాయి. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతమైతే ఎలా అనే దాంట్లోంచి పుట్టిందే ఈ ‘విద్యుత్తు ఐలాండ్’. అత్యవసర సమయాల్లో గ్రిడ్ వైఫల్యంతో చీకట్లు అలుముకునే పరిస్థితి ఎదురైనప్పుడు.. దీని ద్వారా రాజధానులు, ప్రధాన కార్యాలయాలు, సంస్థలు ఉన్న ప్రాంతాల్లో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసేలా సాంకేతికంగా ఏర్పాట్లు చేయడమే ఈ ఐలాండ్ ఉద్దేశం. గ్రిడ్ వైఫల్యం చెందే సమ యం వస్తే ఈ ఐల్యాండ్ ఆటోమేటిక్గా ఏర్పడి అంతరాయం లేకుండా చేస్తుంది. అప్పటివరకు ఉన్న విద్యుత్తు కనెక్షన్ నిలిచిపోయి.. ఈ ఐలాండ్ పరిధి దానికదే ఒక ప్రత్యేక గ్రిడ్లా పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని పరిధిలో ఎంత విద్యుత్తు అవసరమో ముందుగానే అంచనా వేసి ఉత్పత్తి జరుగుతుంది. ఇలా గుర్తించిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను, ఈ ఐలాండ్తో అనుసంధానిస్తారు. గ్రిడ్ విఫలమైనప్పుడు ఇటు విద్యుత్తు ప్రాజెక్టులకు, అటు ఐలాండ్ ప్రాంతానికి.. మిగ తా ప్రాంతాలు, సంస్థలతో కనెక్షన్ తెగిపోతుం ది. దీనితో ఐలాండ్ ప్రాంతంలో మాత్రమే విద్యుత్తు సరఫరా ఉంటుంది. అందుకు అవసరమైన కరెంటు కోసం కనెక్ట్చేసిన పవర్ ప్లాంట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంటాయి.
హైదరాబాద్ చుట్టూ విద్యుత్తు వలయం
రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతా ల పరిధిలో ఒక విద్యుత్తు ఐలాండ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వాటర్ వర్క్స్, నిత్యావసరాలు అందించే ముఖ్యమైన సంస్థలు, పర్యవేక్షించే కార్యాలయాలన్నీ దీని పరిధిలో ఉండేలా చూశారు. విపత్కర పరిస్థితుల్లో గ్రిడ్ ఫెయిల్ (బ్లాకౌట్) అయితే.. మొత్తం రాష్ట్రంలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలన్నీ నిలిచిపోతాయి. హైదరాబాద్ ప్రాంతం మొత్తం ఒక పవర్ ఐలాండ్గా మారిపోతుంది. దీంతో అనుసంధానించబడి ఉన్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు మాత్రం పనిచేస్తాయి. వాటినుంచి ఐలాండ్కు మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతుంది. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఐలాండ్ పరిధిలోని 400 కేవీ సామర్థ్యం ఉన్న 7 సబ్స్టేషన్లు, 220 కేవీ సామర్థ్యం ఉన్న 17 సబ్స్టేషన్లు, 132 కేవీ సబ్స్టేషన్లు 44 నిరంతరాయంగా పనిచేస్తాయి.
ఫ్రీక్వెన్సీ 47.90 హెర్ట్ కు పడిపోతే..
గ్రిడ్ వైఫల్యం చెందకుండా ఉండాలంటే 50.05-49.90 హెర్ట్ మధ్యలో ఫ్రీక్వెన్సీని కాపాడుతూ ఉండాలి. అంటే విద్యుత్తు డిమాండ్, సరఫరా మధ్య భారీ తేడా లేకుండా చూడాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువగా ఉండి డిమాండ్ తగ్గినా.. డిమాండ్ భారీగా ఉండి ఉత్పత్తి (సరఫరా) తగ్గినా ఫ్రీక్వెన్సీ పడిపోతుంది. ఈ పడిపోవడం అనేది 47.90 హెర్ట్కు వచ్చిందంటే చాలు.. గ్రిడ్ బ్లాకౌట్ అయినట్టే. ఆ వెంటనే హైదరాబాద్ వరకు ప్రత్యేక పవర్ ఐలాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల గ్రిడ్ పరిధిలో మొత్తం సరఫరా నిలిచిపోయినా.. ఈ ఐల్యాండ్ పరిధిలో మాత్రం విద్యుత్తు ఉంటుంది.
3,700 మెగావాట్ల ఉత్పత్తి..
హైదరాబాద్ విద్యుత్తు ఐలాండ్కు అవసరమైన విద్యుత్తు కోసం మూడు పవర్ ప్రాజెక్టులను అనుసంధానించారు. కాకతీయ థర్మల్ పవర్స్టేషన్ (భూపాలపల్లి), సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ (మంచిర్యాల), ఎన్టీపీసీ (రామగుండం) దీనికి అనుసంధానించారు. దీనివల్ల సుమారు 3,700 మెగావాట్ల వరకు విద్యుత్తు స్థాపిత సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుల్లో సగటున 80 పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల సుమారు 2,960 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. దీనితో సుమారు 2,916 మెగావాట్ల డిమాండ్ ఉన్న ప్రాంతాలకు విద్యుత్తును సరఫరా చేయవచ్చనికూడా అంచనా వేసిన ట్రాన్స్కో అధికారులు ఆ పరిధి మేరకు ఐలాండ్ను ఏర్పాటు చేశారు.
దక్షిణ భారతంతో 7 ఐలాండ్లు
2012లో గ్రిడ్ వైఫల్యంతో ఇలాంటి ఐలాండ్ లను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నది. దక్షిణ భారత దేశంలో సుమారు 7 ఐలాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా మన హైదరాబాద్ ఐలాండ్ను 2015 నుంచే తీర్చిదిద్దారు. దీంతోపాటు బెంగళూరు, చెన్నై, నైవేలీ, కూడంకుళం, విశాఖపట్నంలలో పవర్ ఐలాండ్ లను ఏర్పాటు చేయగా.. విజయవాడలో అది పూర్తయ్యే దశలో ఉన్నది.