బెంగళూరు, జూన్ 2: ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రేప్ కేసు విచారణలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దోషుల కాళ్లు, చేతులు నరికివేస్తేనే బహుశా ప్రజలు చట్టాన్ని ఎలా పాటించాలో తెలుసుకుంటారేమో. మనకు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని సహజంగా తేలికగా తీసుకుంటున్నారు’ అని జస్టిస్ ఆర్ నటరాజ్ వ్యాఖ్యానించారు. ‘ప్రజలు చాలా సహజంగా ఒక నిత్యకృత్యంలా నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం చట్టప్రకారం నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో చట్టం తన పదునును కోల్పోతున్నది.
అందుకే పశ్చిమాసియాలో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ నేరం చేయడం సులభంగా మారింది’ అని ఆయన పేర్కొన్నారు. మణిపాల్లోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో బాధితురాలు, నిందితుడు సహ విద్యార్థులు. 2023, సెప్టెంబర్ 12న తన అపార్ట్మెంట్కు ఆహ్వానించిన విద్యార్థి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తొలుత జాతీయ మహిళా కమిషన్, తర్వాత పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.