Power Cut | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు కరెంటు పోవడంపై విద్యుత్తు శాఖ స్పందించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఎక్స్లో చేసిన పోస్ట్కు టీఎస్ఎస్పీడీసీఎల్ వివరణ ఇచ్చింది. సీఎం పర్యటన సమయంలో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తలేదని పేర్కొన్నది. ఆ ఇంట్లో అదనంగా లైట్లు బిగించారని, ఇందుకోసం వేసిన తాత్కాలిక వైరింగ్లో లోపం కారణంగానే కరెంటు పోయిందని తెలిపింది. సతీశ్రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోల్లోనే ఇంట్లోని, వీధిలోని లైట్లు వెలుగుతున్నాయని గుర్తుచేసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్తు వినియోగం ఉన్నప్పటికీ నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించింది. అయితే, ఈ వివరణపై సోషల్ మీడియాలో సెటైర్లు కనిపించాయి. ‘ఇంట్లో లైట్ కనిపిస్తున్నదని కరెంట్ ఉన్నది అంటావ్.. అది ఇన్వర్టర్ లేదా జనరేటర్ కాదు అంటావ్. అంతేగా.. అంతేగా?’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
కేసీఆర్ మాట్లాడుతుండగా..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సైతం కొన్ని సెకండ్లపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. దీనిపై టీఎస్ఎస్పీడీసీఎల్ వివరణ ఇచ్చింది. సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రైవేట్ జనరేటర్ల ద్వారా విద్యుతును సరఫరా చేసుకున్నారని తెలిపింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎక్కడా కరెంటు పోలేదని స్పష్టం చేసింది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్రావు మెదక్ జిల్లా నిజాంపేటలో పర్యటిస్తున్న సమయంలో కొద్దిసేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది.