హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. నిరుడు ఇదే నెలలో లేని డిమాండ్ ప్రస్తుతం 13,444 మెగావాట్ల గరిష్ఠానికి చేరింది. డిసెంబర్లో అత్యధిక డిమాండ్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాదిలో ముందస్తుగా వరినాట్లు వేయడంతోనే డిమాండ్ తీవ్రమైనట్టు విద్యుత్తుశాఖ అధికారులు పేర్కొన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా విస్తరించడంతో డిమాండ్ పెరిగినట్టు చెప్పారు.
రాష్ట్రంలో అత్యధిక విద్యుత్తు వినియోగం వ్యవసాయ రంగంలోనే ఉంటుందని తెలిపారు. వాస్తవానికి ఏటా ఫిబ్రవరిలో గరిష్ఠ విద్యుత్తు వినియోగం నమోదవుతుంది. కానీ, డిసెంబర్లోనే గరిష్ఠ డిమాండ్ నమోదైంది. వచ్చే ఏడాది వేసవిలో విద్యుత్తు డిమాండ్ 15 వేల మెగావాట్లకు చేరినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.