హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు ముదరక ముందే విద్యుత్తు వినియోగం రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) డిస్కమ్ పరిధిలో గురువారం ఆల్టైం రికార్డు నమోదైంది. గరిష్ఠ డిమాండ్ 9,359 మెగావాట్లకు చేరుకోగా విద్యుత్తు వినియోగం 183.63 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్ఠ డిమాండు 2,910 మెగావాట్లు, విద్యుత్తు వినియోగం 56 మిలియన్ యూనిట్లుగా నమోదైనట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
డిస్కమ్ పరిధిలోనే ఇది ఆల్టైం రికార్డు అని పేర్కొన్నారు. ఎంత డిమాండ్ పెరిగినా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గత మంగళవారం గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 14,794 మెగావాట్లు నమోదుకాగా, అత్యధికంగా విద్యుత్తు వినియోగం 290.5 మిలియన్ యూనిట్లుగా నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గరిష్ఠంగా 18 వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఏర్పడినా తట్టుకునే శక్తి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు ఉన్నదని అధికారులు చెప్తున్నారు.