బహిరంగ విచారణలో ఈఆర్సీకి వివరించిన డిస్కంలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 : మెరుగైన సేవలను అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు టారిఫ్ను పెంచుతున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఖర్చులు పెరిగాయని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) విద్యుత్తు బిల్లుల పెంపు అంశంపై బహిరంగ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్తు టారిఫ్ పెంపు ప్రతిపాదన చేయడానికి గల కారణాలను తెలంగాణలోని రెండు డిస్కంలు ఈఆర్సీకి వివరణ ఇచ్చాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్తో పోల్చితే తెలంగాణలో లోటెన్షన్, హైటెన్షన్ విద్యుత్తు టారిఫ్లు వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు తక్కువగా ఉన్నాయని అధికారులు వివరించారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన ధర తక్కువగా ఉన్నదని, మెరుగైన సేవలను అందించే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు టారిఫ్ను పెంచుతున్నామని తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.2,686.79 కోట్లు, టీఎస్ఎన్పీడీసీఎల్కు రూ.1,410.44 కోట్ల ఆదాయ వ్యత్యాసం ఉన్నది. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తులోనూ నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలంటే సంస్థలకు ఆర్థిక వనరులు ఇంకా కావాల్సి ఉన్నది. దీనికి తోడు డిస్కంల విద్యుత్తు కొనుగోలు ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్తు టారిఫ్ పెంపు ప్రతిపాదనను ఆమోదించాలని ఈఆర్సీని అధికారులు అభ్యర్థించారు. విద్యుత్తు నష్టాలను అరికట్టేందుకు దశలవారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పథకం సిద్ధం చేస్తున్నామని డిస్కంల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలను పెంచి ఐదేండ్లు గడిచిందని, నాటి నుంచి ఇప్పటివరకు విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలో గణనీయంగా ఖర్చులు పెరిగాయని, దీంతో ఆదాయంలో లోటు వస్తున్నది. భవిష్యుత్తులో డిస్కంలను నడపాలంటే చార్జీలను సవరించాల్సి వచ్చిందని అధికారులు ఈఆర్సీకి వివరించారు.