పండిన ఆకును చూసి ఎండిన ఆకు నవ్విందట! శాతగానమ్మకు శాపనలెక్కువ! కరెంటు ఉంటే బిల్లులు వస్తయి కానీ.. ఇక్కడ ఇయ్యని కరెంటుకు రేటెక్కువ.. నీకు ఇచ్చుడు శాతగాదు.. చూసుడు శాతకాదు!
విద్యుత్తు నిర్వహణ శాతకాదు.. మౌలిక వసతుల కల్పన చేసుకోరు. పారిశ్రామిక వాడల్లో బీభత్సంగా పవర్ హాలిడేలు.. వ్యవసాయానికి ఆరేడు గంటలకు మించని సరఫరా.. ఇండ్లకు నాలుగైదు గంటల కోతలు.. వీటన్నింటినీ పట్టించుకోకుండా బిల్లులు మాత్రం అడ్డగోలుగా వస్తుంటాయి.. తిరకాసు శ్లాబులు.. అడ్డదిడ్డంగా చార్జీల పెంపు.. ఫలితం కోటి మందికి పైగా వినియోగదారుల జేబులకు షాక్.. ఇది మన సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో దుస్థితి.
గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు.. వ్యవసాయానికి రోజంతా ఉచిత కరెంటు.. విద్యుత్తు సంస్థల బలోపేతం.. వేసవి తాకిడిని ముందే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు.. హేతుబద్ధమైన శ్లాబులు.. నియమితంగా చార్జీలు.. కోతలు లేవు.. పవర్ హాలిడేలు లేవు.. రేయింబవళ్లు విరబూస్తున్న వెలుగు మొగ్గలు.. ఇది మన రాష్ట్రం తెలంగాణలో పరిస్థితి.
మోదీ ప్రభుత్వం ప్రతిరోజూ పెట్రోల్ ధరలు పెంచుతుంటే అక్షరమైనా విశ్లేషణలు రాయలేని ఈ పత్రికలు తెలంగాణలో ఐదేండ్ల తర్వాత స్వల్పంగా విద్యుత్తు చార్జీలు పెంచితే క్షేత్రస్థాయి కథనాలంటూ గాయిగాయి చేస్తున్నాయి
హైదరాబాద్ , మే 11 (నమస్తే తెలంగాణ): కొన్ని ఆంధ్ర పత్రికలకు తమ రాష్ట్ర దుస్థితి కనిపించడంలేదు.. తెలంగాణలో పరిస్థితులు మింగుడుపడటంలేదు. లేనిదాన్ని ఉన్నట్టు.. ఉన్నదాన్ని లేనట్టు చూపించడంలో ఈ పత్రికలకు సాటిలేదు. తమ దుస్థితిని కప్పి పుచ్చడానికి సక్కగా ఉన్న తెలంగాణపై ఏడుస్తూనే ఉంటాయి. తెలంగాణ రావడానికి ముందైనా.. వచ్చినాకైనా వాటి బుద్ధి మారలేదు. తెలంగాణలో వేసవికి ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో విద్యుత్తు సంక్షోభం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడగలిగింది. చార్జీల పెంపుదలలోనూ, శ్లాబుల నిర్ణయంలోనూ నిర్హేతుకంగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. రాష్ట్రం వచ్చిన తరువాత 2016లో 101-200 యూనిట్ల వరకు ఒకసారి నామమాత్రంగా చార్జీలు పెంచారు. తర్వాత ఐదేండ్లకు ఇటీవల పది పైసల నుంచి 50 పైసల వరకు పెంచారు. దీనివల్ల వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చూసింది.
ఆంధ్రప్రదేశ్లోనే అధికం
2015-16 నుంచి ప్రతియేటా ఏదో ఒక క్యాటగిరీలో విద్యుత్తు చార్జీలను ఏపీ ప్రభుత్వం పెంచుతూనే ఉన్నది. తాజాగా 45 పైసల నుంచి రూ.2.40 దాకా చార్జీలను పెంచింది. సాధారణంగా గృహ వినియోగదారుల్లో.. 200 యూనిట్ల వరకు వినియోగించేవారే 70% నుంచి 90% ఉంటారు. ఈ క్యాటగిరీలకు సం బంధించిన శ్లాబుల్లోనే ఏపీలో ఎక్కువ చార్జీలు ఉన్నా యి. వివిధ శ్లాబుల్లో ఫిక్స్డ్, కస్టమర్ చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీలన్నీ కలిపితే తడిసి మోపెడవుతున్నది.
కస్టమర్ చార్జీల విషయంలో రెండు రాష్ర్టాల మధ్య హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. అన్ని రకాల చార్జీలు, పన్నులు కలుపుకొంటే ఏపీలోని సుమారు కోటి మంది వినియోగదారులు.. తెలంగాణలోని 96.82 లక్షల మంది వినియోగదారుల కంటే ఎక్కువ బిల్లు కడుతున్నారని స్పష్టం. 50 యూనిట్ల వరకు వినియోగించేవారి నుంచి ఏపీ సర్కారు తెలంగాణ కంటే రూ.9 ఎక్కువ వసూలు చేస్తున్నది. 100 యూనిట్లు వాడితే ఏపీలో బిల్లు తెలంగాణ కంటే.. రూ.27 ఎక్కువ కట్టాలి. ఇక 200 యూనిట్లు వాడితే.. ఏపీ వినియోగదారుడు.. తెలంగాణ కంటే ఏడు రూపాయలు అదనంగా చెల్లించాలి.
తిరకాసు శ్లాబులు
గృహ వినియోగదారుల నుంచి యూనిట్కు వసూలు చేస్తున్న విద్యుత్తు చార్జీలను పరిశీలిస్తే.. తెలంగాణలోనే అతి తక్కువ చార్జీలను వసూలు చేస్తున్నట్టు అర్థమవుతున్నది. 800 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించుకొనే వారి నుంచి మాత్రమే యూనిట్కు రూ.10 చొప్పున తెలంగాణ వసూలుచేస్తుండగా.. ఏపీలో మాత్రం సున్నా మొదలుకొని.. 800 యూనిట్ల వరకు ఏపీలోనే అత్యధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. సామాన్య జనానికి అర్థంకాని విధంగా శ్లాబులనుకూడా ఏపీ ప్రభుత్వం విభజించిందని విద్యుత్తు రంగ నిపుణులు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గృహ వినియోగదారుల మొదటి శ్లాబు 0-50 యూనిట్ల వరకు ఉన్నది. తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం చూడటానికి తక్కువ అనిపించేలా 0-30 యూనిట్లకు తొలి శ్లాబును నిర్ణయించింది. శ్లాబులను చిన్నగా విభజించి ఎక్కువ చార్జీలను వసూలుచేస్తున్నది. ఏపీలో 0-30 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.90 పైసలు వసూలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం 50 యూనిట్ల వరకు రూ.1.95 పైసలు వసూలు చేస్తున్నారు. ఏపీలో 31 నుంచి 50 యూనిట్ల వరకు యూనిట్కు రూ.3.00 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక్కడ 20 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్కు ఏపీలో రూ.1.05 పైసల చొప్పున ఎక్కువగా వసూలు చేస్తున్నారు. 400 నుంచి 800 లోపు యూనిట్లు వినియోగించేవారి నుంచి ఏపీలో యూనిట్కు రూ.9.75 పైసలు వసూలు చేస్తుండగా.. తెలంగాణలో 401 నుంచి 800 యూనిట్ల వరకు రూ.9.50 పైసలు వసూలు చేస్తున్నారు. శ్లాబులు తిరకాసుతో ఏపీ విద్యుత్తు అధికారులు ఖజానాలో కాసులు గుమ్మరిస్తున్నారు.
నిరంతర విద్యుత్తు సరఫరాలోనూ తెలంగాణే మేటి
అన్ని రకాల వినియోగదారులకు విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయడంలో ఏపీ కంటే తెలంగాణ మెరుగ్గా ఉండటమే కాదు.. దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఏపీలో ప్రస్తుతం గృహ వినియోగదారులకు రోజుకు కనీసం 4-5 గంటలపాటు విద్యుత్తు కోతలు తప్పడం లేదు. పరిశ్రమల రంగానికి ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించారు. వ్యవసాయానికి ఎంత చెప్పుకొన్నా తక్కువే. 9 గంటలపాటు విద్యుత్తును అందిస్తున్నామని చెప్పినా.. ఆరేడు గంటలపాటే విద్యుత్తు అందుతున్నది. చాలా ప్రాంతాల్లో ఇదికూడా రెండు విడతల్లో ఇస్తున్నారు. మోటర్లకు మీటర్లు పెట్టే ప్రక్రియలో శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, 2023 నాటికి రాష్ట్రమంతటా పెడతామని సాక్షాత్తు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
2014లో తెలంగాణ: కరెంటు కోసం అంగలార్చి..
ఈ ఫొటో 2014లో తెలంగాణలో కరెంటు పరిస్థితికి నిదర్శనం. మెదక్ జిల్లా చేగుంటలో కరెంటు లేక రైతులు రాస్తారోకో చేస్తున్న దృశ్యమది. గంటల తరబడి కోతలు, బిల్లుల వాతలు నాటి పరిస్థితి. నాడు కరెంటు ఉంటే ఒక వింత. సాగుకైనా, పరిశ్రమలైనా కరెంటు కోసం కండ్లు కాయలు కాచేలా చూడాల్సిన పరిస్థితి
2022లో ఏపీ: అరకొర.. అంతరాయాలు
ఈ ఫొటో 2022లో అంటే, నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో తీసింది. వారానికి ఒక్క రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో కర్నూలు జిల్లా కల్లూరు పారిశ్రామిక ఎస్టేట్లో ఆగిన స్టోన్ క్రషింగ్ యూనిట్లు ఇవి. రాష్ట్ర విభజన తర్వాత 8 ఏండ్లకు కూడా నేటి ఏపీలో పరిస్థితి ఏమీ మారలేదు. అవే కరెంటు కోతలు.
2022లో తెలంగాణ: ప్రతి రంగానికీ నిరంతరం
కరెంటు కష్టాల నుంచి తెలంగాణను బయట పడేయాలనే దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్తు రంగంలో పూర్తి స్థాయి సంస్కరణలు తీసుకువచ్చారు. వ్యయసాయం మొదలుకొని అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్తు అందించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఫలితంగా ఇప్పుడు దేశమంతా అంధకారం అలుముకొని ఉన్నా, తెలంగాణ మాత్రం వెలుగులు విరజిమ్ముతున్నది. నిరంతర కరెంటుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వికారాబాద్ జిల్లా తాండూరు పాలిషింగ్ యూనిట్లలో నాపరాతిని కట్ చేస్తున్న దృశ్యమిది.
కొన్ని ఆంధ్రా పత్రికలకు ..
అక్కసో తెలియదు, ఆసూయో తెలియదు. కానీ, అవి పదేపదే తెలంగాణ విద్యుత్తు రంగంపై నిందలేసి నిప్పులు కక్కుతున్నాయి. ఏపీలో ముసురుకున్న చీకట్లలో వాస్తవాలు వాటికి కనిపించడంలేదో, తెలంగాణలో జరిగిన మంచి మార్పు రుచించడం లేదో తెలియదు. కానీ అవి తెలంగాణ కరెంటు చార్జీలు ఎక్కువంటూ వార్తలు వండుతున్నాయి.
అసలు నిజం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే మన సంగతి.. ఏపీలా అధోగతే.