హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో విద్యుత్తు వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పా టు చేయాలని టీఎస్ రెడ్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో అమలవుతున్న సోలార్, విండ్, స్మాల్ హైడ్రోపవర్, చెత్త నుంచి విద్యుత్తు తయారీ కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సచివాలయంలో శుక్రవారం అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాలపై సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని భట్టి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ రూఫ్టాప్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. సోలార్, విండ్, హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ లాంటి పెండింగులో ఉన్న అన్ని టెక్నాలజీ పాలసీలపైన ఆయన చర్చించారు. మున్సిపల్ ప్రాంతాల్లో సేకరించిన చెత్త నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్, విద్యుత్తు తయారీ పనులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి పెంపునకు గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదల గురించి టీఎస్ రెడ్కో వీసీ ఎండీ జానయ్య వివరించారు.
భట్టి ఇంటికి దోమ తెరలకు టెండర్లు
ఉపముఖ్యమంత్రి అధికార నివాసం ప్రజాభవన్లో పలు సివిల్ పనుల కోసం రోడ్లు, భవనాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. గతంలో ప్రగతి భవన్ పేరుతో ఉన్న ఈ భవంతి పేరును కాంగ్రెస్ అధికారం చేపట్టాక మహాత్మా జ్యోతిరావుపూలే ప్రజాభవన్గా మార్చింది. ఇక్కడి నివాస సముదాయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉంటున్నారు. ఈ ఇంటిలో మార్పులు, చేర్పులకు ఆర్అండ్బీ అధికారులు టెండర్లు పిలిచారు. సివిల్ పనులు, కిటికీలకు దోమతెరలు, బాత్రూంలకు సానిటరీ వేర్ సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు.
బంగారు బాత్రూంలు ఉన్నయా మరి?
టెండర్ల ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు కాంగ్రెస్ను ఓ ఆటాడుకుంటున్నారు. బంగారు బాత్రూంలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న నాయకులు ఇప్పుడు వాటి మరమ్మతులకు సాధారణ టెండర్లు ఎందుకు పిలిచారు? అని ప్రశ్నించారు.