Karimnagar Electric Bus | కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. కరీంనగర్ 2 డిపోలో నిలిపి ఉంచిన బస్సులో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మా్త్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
డిపోలో నుంచి ఎలక్ట్రిక్ బస్సును బయటకు తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో మంటలు రాగానే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? బ్యాటరీలో సాంకేతిక లోపం కారణమా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కాగా ఈ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు స్పందించారు. ఉదయం డిపో నుంచి ఎలక్ట్రిక్ బస్సును బయటకు తీస్తున్న సమయంలో ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడని పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.