హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ర్టాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ముంబైలో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి అడిషనల్ డీజీలు శివధర్రెడ్డి, సంజయ్కుమార్ జైన్, మహేశ్ భగవత్ హాజరయ్యారు. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్ల వివరాలను ఏడీజీ సంజయ్కుమార్ జైన్, సంఘ విద్రోహ శక్తులపై నిఘా వివరాలను ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్రెడ్డి వివరించారు. ఎన్నికల వేళ.. పట్టుబడుతున్న నగదు, మద్యం, బంగారం, డ్రగ్స్, ఇతర ఉచితాల వివరాలను ఏడీజీ మహేశ్ భగవత్ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నికల సంఘం అధికారులు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కాగా ఈ సమావేశానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అధికారులు ఆన్లైన్ మీటింగ్ ద్వారా హాజరైనట్లు సమాచారం.