Minister Malla Reddy | మేడ్చల్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి చామకూర మల్లారెడ్డి నామినేషన్ను ఈసీఐ మార్గదర్శకాల ప్రకారమే ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్కుమార్ తెలిపారు. నామినేషన్ల తర్వాత మల్లారెడ్డి విద్యార్హతలపై దాఖలైన కౌంటర్ అఫిడవిట్పై మంగళవారం ఆయన వివరణ ఇచ్చారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మేడ్చల్ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడి సమక్షంలో నిర్వహించినట్టు తెలిపారు.
రిటర్నింగ్ అధికారి మాన్యువల్లోని పారా 6.10.1(ఐవీ) ప్రకారం నిర్దేశించిన అఫిడవిట్ను పూర్తిగా నింపిన కారణంగా నామినేషన్ను తిరస్కరించకూడదని పేర్కొన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్లోని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి దాఖలు చేసిన నామినేషన్లు, అఫిడవిట్లను ఈఎస్ఐ ఆదేశాల మేరకు ఆర్వో నోటీస్ బోర్డులో పెట్టినట్టు, ఈఎస్ఐ వైబ్సైట్లో కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు. 8వ తేదీన 2 సెట్లు, 9న రెండు సెట్ల నామినేషన్లతోపాటు అఫిడవిట్లు దాఖలు చేసినట్టు వివరించారు. అన్ని పరిశీలనలు పూర్తయిన తర్వాతే ఈఎస్ఐ మార్గదర్శకాల ప్రకారం అమోదించినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.