హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కోరారు. ప్రతి ఫిర్యాదుకు స్పందిస్తామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి ఓటరుకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ-ఎపిక్ కార్డులను ఓటర్ల సేవా పోర్టల్ నుంచి ఓటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మంగళవారం బీఆర్కే భవన్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాతో సహా ఏ అంశంపైన అయినా చేసే సహేతుకమైన ప్రతి ఫిర్యాదును సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. రాజకీయ ఫిర్యాదులపై సమయం, శ్రమను ఆదా చేయడంతోపాటు వీలైనంత త్వరగా న్యాయం అందించే దిశగా స్థానికంగా సహకరించాలని అన్ని జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల అధికార అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి రాజకీయ పార్టీలతో ఈ నెల 14 వరకు 2,100కు పైగా సమావేశాలు నిర్వహించామని ఆయన వివరించారు.