ఖమ్మం ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ)/ వరంగల్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల పాలకవర్గాలు శుక్రవారం కొలువుదీరనున్నాయి. మొదట కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్లు.. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక చేపట్టనున్నారు. ఈ మేరకు వరంగల్లో మధ్యాహ్నం 3 గంటలకు 66 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను చేపట్టనున్నారు. ఇందుకోసం నగరంలోని ఇండోర్ స్టేడియం ముందుభాగంలో వేదికను ఏర్పాటుచేశారు. ప్రమాణ స్వీకారం చేసే సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు.
ఎన్నికల పరిశీలకులుగా నియమించిన ఐఏఎస్ అధికారి కిషన్, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఖమ్మం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు టీఆర్ఎస్ పరిశీలకులుగా శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి హాజరుకానున్నారు. తొలుత కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. హాజరుకాలేని కార్పొరేటర్లకు వీడియోకాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. కాగా, ఖమ్మం మేయర్ పీఠం ఈసారి మహిళ (జనరల్)కు రిజర్వ్ కావడంతో తొలిసారిగా మహిళ కొలువుదీరనున్నారు. అటు సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.