హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కూడా బీజేపీ చేతిలో పావుగా మారింది. టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన 8 గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సోమవారం హైకోర్టులో టీఆర్ఎస్ వేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం చెప్పిన తరువాత కూడా ఈసీఒక స్వతంత్ర అభ్యర్థికి రోడ్డురోలర్ గుర్తును కేటాయించడం విమర్శలకు తావిస్తున్నది.
లంచ్మోషన్ పిటిషన్ వేసిన సందర్భంలో పిటిషనర్ ఇందు కు సంబంధించిన సమాచారాన్ని ప్రతివాదులకు తెలియజేయాల్సి ఉంటుంది. గుర్తు ల తొలగింపుపై ఈసీకి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేయడమే కాకుండా హైకోర్టులో విచారణాంశాన్ని కూడా తెలియజేసింది. అయినప్పటికీ.. ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పట్టించుకోకుండా ఆదరాబాదరాగా సోమవారం సాయంత్రం స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక కావడంతో బీజేపీ ఎన్నికల సంఘం ద్వారా కుతంత్రాలకు తెరలేపింది. టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బ తీయడానికి ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. వాస్తవానికి గతంలోనే ‘రోడ్డు రోలర్’ను సీఈసీ తొలగిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అయినా లెక్క చేయకుండా యుగ తులసీ అనే పార్టీ అభ్యర్థికి కేటాయించింది.
2011లోనే తొలగింపు
2009 ఎన్నికలప్పుడే టీఆర్ఎస్ తన కారును పోలిన గుర్తు వల్ల చాలా స్థానాల్లో ఓట్లను కోల్పోవలసి వచ్చింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన ఈసీ.. 2011 నవంబర్ 4న రోడ్డు రోలర్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు 56/2011 పీపీఎస్ నంబర్ ఉత్తర్వు ద్వారా ఆదేశాలిచ్చింది. కానీ, 2014, 2018, 2019 ఎన్నికల్లోనూ రోడ్డురోలర్ గుర్తును కేటాయిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల సందర్భంలో సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్కు ట్రక్ గుర్తును ఇవ్వడంపై టీఆర్ఎస్ వ్యక్తంచేసిన అభ్యంతరాన్ని హైకోర్టు మన్నించింది. హైకోర్టు ఆదేశాలను ఈసీ కూడా అమలుచేసింది. కారును పోలిన 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితానుంచి తొలగించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. సోమవారం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ కూడా వేసింది. అయినప్పటికీ.. ఈసీ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ఎన్నికల సంఘం దగ్గర కేవలం నమోదైన పార్టీ కాదు.. గుర్తింపు ఉన్న పార్టీ. ఎన్నికల నియమావళిని అనుసరించి గుర్తింపు పొందిన పార్టీ చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఈసీ ఏకపక్షంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలు కావడానికి రోడ్డు రోలరే కారణమైంది. ఇక్కడినుంచి పోటీ చేసిన లింగపాక సింగం కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించడంతో పోలైన ఓట్లలో 2.73 శాతం (27,927 ఓట్లు) పోలు కావడంతో ఫలితమే తారుమారైంది. 2014 ఎన్నికల్లో నర్సంపేటలోనూ ఇదే ఎదురైంది.
ఆర్వో ఆఫీసు ఎదుట భారీ ఆందోళన
రోడ్డు రోలర్ గుర్తు కేటాయించడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం రాత్రి విషయం తెలియగానే చండూరులోని ఆర్వో ఆఫీసుకు పెద్దఎత్తున చేరుకున్నాయి. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు నోముల భగత్, కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగా యి. ‘జై తెలంగాణ, వీ వాంట్ జస్టిస్, ఎలక్షన్ కమిషన్ నిరంకుశ వైఖరి నశించాలి, బీజేపీ డౌన్ డౌన్’ అంటూ నినదించాయి. రోడ్డు రోల ర్, బుల్డోజర్ గుర్తులను తొలగించాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుని తమకు కొంత సమయం ఇవ్వాలని, చర్చించి నిర్ణయం చెప్తామని తెలిపారు. కానీ ఎంతకీ అధికారులు తమ సమాధానాన్ని తెలియజేయలేదు.
అరెస్టు.. పోలీస్స్టేషన్కు తరలింపు..
రెండు గంటలు గడిచినా ఎన్నికల అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. టీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. మూడు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. రోడ్డు రోలర్ గుర్తును తొలగించే వరకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఎన్నికల అధికారులు రాకపోగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కి తరలించారు. అరెస్టయిన వారిలో టీఆర్ఎస్ నాయకులు తుంగ బాలు, తోకల వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కోడి వెంకన్న, పెద్దగోని వెంకన్న, మల్లారెడ్డి, రాము తదితరులు ఉన్నారు.
హైకోర్టును ఆశ్రయిస్తాం: బాల్క సుమన్
మునుగోడులో స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించడంపై హైకోర్టును ఆశ్రయిస్తామని విప్ బాల్క సుమన్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే రోడ్డు రోలర్ను కేటాయించిందని ఆరోపించారు. సోమవారం రాత్రి చండూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి జేబు సంస్థగా మారిందని విమర్శించారు. రోడ్డు రోలర్పై గతంలోనే ఫిర్యాదు చేశామని, ఎన్నికల కమిషన్.. దానిని తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాలుగో నంబర్లో కారు గుర్తు ఉంటే, ఐదో స్థానంలో కావాలనే రోడ్డు రోలర్ గుర్తు ఇచ్చారని ఆగ్రహించారు.
ఆ గుర్తులు చట్ట విరుద్ధం
వాటిని తొలగించాల్సిందే
హైకోర్టులో టీఆర్ఎస్ రిట్
నేడు ధర్మాసనం విచారణ
కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్యాలెట్ పేపరులో లేకుండా చేయకపోవడం చట్ట వ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేయాలని ఆయన తరపు న్యాయవాది కటిక రవీందర్రెడ్డి కోరడంతో మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
ఇందులో ప్రతివాదులుగా ఈసీ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, చండూరు రిటర్నింగ్ అధికారులను చేర్చారు. ఇప్పటికే కారు గుర్తు ను పోలిన గుర్తులు తొలగించాలని ఈసీని కోరామని, ఈసీ నుంచి స్పందన లేకపోవడం తో హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చిందని టీఆర్ఎస్ రిట్లో పేరొన్నది. టీఆర్ఎస్ ఎన్నిక ల గుర్తు కారును పోలినట్టుగా ఉండే కెమెరా, చపాతీ రోలర్, డోలి (పల్లకి), రోడ్ రోలర్, సబ్బుపెట్టె, టీవీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులు ఓటర్లను గందరగోళానికి గురి చేస్తాయని వివరించింది. రోడ్డు రోలర్, కెమెరా, టెలివిజన్ గుర్తులకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు నమోదైన విషయాన్ని గణాంకాలతో వివరించింది. ఈ గుర్తుల విషయంలో తమ అభ్యంతరాలపై ఈసీ స్పందించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 2018 ఎన్నికల్లో పలువురు ఓటర్లు కారు గుర్తుగా భావించి రోడ్రోలర్ గుర్తుకు ఓట్లు వేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో కారు గుర్తును పోలి ఉన్న రోడ్రోలర్ సహా 8 గుర్తుల తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.