హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి ఖరారైంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని రూ.40 లక్షలకు పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం.. లోక్సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించింది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.28 లక్షలకు మించి ఖర్చు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.
తెలంగాణ, రాజస్థాన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తోపాటు ఏపీ, బీహార్, గుజరాత్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.40 వరకు ఖర్చు చేసుకునేందుకు వీలుకల్పించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు. పార్టీ చేసే ఖర్చు అభ్యర్థి వ్యయంలోకి రాదు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులను బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికే కొత్తగా కొత్తగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చులు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన తాయిలాలను అభ్యర్థుల వ్యయంలో చేర్చాలని ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతోపాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, భోజనాలు, వాహనాల అద్దె, వాటి ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికా/టీవీ/సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతి దానికీ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఎన్నికల సంఘం ధరలను నిర్ణయిస్తుంది. ఆ ధరల ప్రకారమే లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఈ ధరల వివరాలను జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయి.