హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ ఎన్నికల కోసం ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు ఓటరు జాబితా సవరణ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఓటు హక్కు లేనివారితోపాటు జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు, చిరునామా మారినవారు, ఓటరు జాబితాలో పేర్లు, ఇతర వివరాలు తప్పుగా పడినవారు దరకాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
మరణించిన, చిరునామా మారిన ఓటర్ల వివరాల సేకరణ కోసం స్థానిక జాతీ య, ప్రాంతీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు అన్ని రాష్ర్టాల ఎన్నికల ప్రధానాధికారులతో ఈ నెల 15న, వచ్చే నెల 12న ఢిల్లీలో సమావేశాలను నిర్వహించనున్న ఈసీ.. ఫిబ్రవరి చివరి నాటికి ఎన్నికల ఏర్పాట్లు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. త్వరలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించి, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.