ECI | హైదరాబాద్ : కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ అంశాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని ఈసీ పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రకటనలు ఆపివేయాలని ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని ఈసీ వెల్లడించింది. ప్రకటన కోసం కర్ణాటక ప్రభుత్వం కనీసం దరఖాస్తు చేయలేదని తెలిపింది.