కొల్లాపూర్, ఫిబ్రవరి 8 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైన వేళ.. కొల్లాపూర్లో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. కొల్లాపూర్ సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకొని కొల్లాపూర్లో తిష్టవేసినట్టు తెలుస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ మొదలైన రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు వార్డుల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు పాల్పడుతున్నట్టు స మాచారం. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణ్ణారావు పేరు పై ఆదివారం సోషల్ మీడియాలో వచ్చిన తాజా ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నది.
కొల్లాపూర్లోని మూడో వార్డుకు చెందిన పసుపుల నర్సింహను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేసినట్టు ఇటీవల ప్రకటించారు. ఆదివారం 13వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమలాకర్రావును సింగిల్ విండో చైర్మన్గా నియమిస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. మూడో వార్డులోని నర్సింహను మార్కెట్ చైర్మన్గా ఎంపిక చేసినట్టు ప్రకటించిన రోజు మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలోనే నర్సింహను శాలువాతో సత్కరించినట్టు ఆ పార్టీ నాయకులే పోస్టులు పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త నియామకాలు చేపట్టకూడదనే ప్రాథమిక సూత్రాన్ని అధికార పార్టీ నాయకులు విస్మరించడం గమనార్హం.
సైకిళ్లు పంపిణీ ?
కొల్లాపూర్లో కాంగ్రెస్ నాయకులతోపాటు, ఓటర్లను పరోక్షంగా ప్రభావితం చేసే లా మంత్రి జూపల్లి ఆరోగ్యంపై నీతిసూత్రాలు వల్లిస్తూ సైకిల్ ఆవశ్యకత గురించి చెప్పి సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వినూత్న ప్రచారం పేరుతో శనివారం కాంగ్రెస్ నాయకులు సైకిళ్లపై తిరగడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓటర్లను ప్రభావితం చేసే హామీలు ఇవ్వకూడదు. పోలింగ్కు ముందే పదవుల ప్రకటన చేయ డం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.