Election Campaign | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్నది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం ముగించాలనే ఎన్నికల సంఘం నిబంధన అనుగుణంగా ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుండగా, 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగియనున్నది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు ముగించాలని నిర్ణయించారు.
ఆయా నియోజకవర్గాల్లో ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న నాయకులు అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈనెల మూడో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు, మంత్రి టి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున సీఎం కేసీఆర్ గజ్వేల్తో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. గత ఎన్నికల్లోనూ గజ్వేల్లోనే ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ చివరి సభ పెట్టారు. ఈ నేపథ్యంలో అదే అనవాయితీని కొనసాగిస్తూ ఈసారీ ఎన్నికల ప్రచార చివరి సభను గజ్వేల్లో ఏర్పాటు చేశారు.