Tragedy | చందుర్తి, ఆగస్టు 20: ఫీటున్నర జాగ కోసం కొడుకు, కోడలి వేధింపులను తట్టుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం వెలుగుచూసింది.
పోలీసుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన కనికరపు దేవయ్య (69), లక్ష్మీనర్సవ్వ (60) దంపతులు. వీరికి కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పాత ఇంటి వెనుక పెద్ద కొడుకు ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. పాత ఇంటి స్థలం నుంచి పెద్ద కొడుకుకు ఫీటున్నర జాగ ఇవ్వాల్సి ఉండగా.. ఇల్లు కూల్చి వేసి ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించాడు. శనివారం తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి మల్లన్న దేవుడిని తీసుకెళ్తామని, ఇల్లు కూల్చివేయాలని వాగ్వాదానికి దిగాడు. మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు తలుపులు పెట్టుకొని శనివారం రాత్రి ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఇం ట్లోకి దిగి చూసేసరికి విగతజీవులై పడి ఉ న్నారు. చిన్న కొడుకు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్సై అశోక్ తెలిపారు. కాగా ఒకే చితిపై వృద్ధ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు.