Gurukula Students | వెల్గటూర్/కొత్తకోట, మార్చి 20: గురుకుల పాఠశాలల్లో కలిసిమెలిసి ఉండాల్సిన విద్యార్థులు తరచూ ఘర్షణలకు దిగుతు న్నారు. జూనియర్లు, సీనియర్లు అనే భావన తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. మాట వినడం లేదన్న కోపంతో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అందుకు.. జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని గురుకుల పాఠశాలల్లో వారం రోజుల కిందట జరిగిన గొడవలే నిదర్శనం. తల్లిదండ్రుల చొరవతో ఈ రెండు చోట్ల జరిగిన ఘటనలు ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చాయి. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం గుంజపడుగుకు చెందిన పస్తం లత-కనకయ్య కొడుకు రిషి (13) వెల్గటూర్ మండలం స్తంభంపల్లి బీసీ గురుకులంలో 8వ తరగతి చదువుతున్నాడు. తన పుట్టినరోజున రిషి డ్రెస్ దొంగిలించాడని తోటి విద్యార్థి రాము జనవరి 9న 9, 10వ తరగతి చదువుతున్న అభినయ్, శ్రీహర్ష, శ్రీకాంత్కు చెప్పాడు. అదే రోజు రాత్రి ఆ ముగ్గురు డ్రెస్ గురించి రిషిని అడిగారు.
తనకేం తెలియదని చెప్పినా వినకుండా పరీక్ష ప్యాడ్లతో తలపై గట్టిగా కొట్టగా తలకు తీవ్రగాయమైంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే.. బిల్డింగ్పై నుంచి తోసేస్తామని బెదిరించడంతో రిషి ఎవరికీ చెప్పలేదు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్లి తరచూ దవాఖానల్లో చూపించారు. అయినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ వైద్యుడికి చూపించగా, వైద్యుడి సలహా మేరకు ఎంఆర్ఐ తీయించారు. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు రిషిని నిలదీయగా.. అసలు విషయం చెప్పాడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు బుధవారం గురుకులానికి చేరుకొని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని తల్లిదండ్రులను సముదాయించారు.
కొత్తకోట పట్టణ సమీపంలోని సాంఘిక సంక్షేమ (వీపనగండ్ల) గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులపై 9వ తరగతి స్టూడెంట్స్ కొన్ని రోజులుగా దాడికి పాల్పడుతున్నారు. జూనియర్స్ చెప్పిన మాట వినడం లేదని తరచూ కర్రలతో దాడి చేస్తున్నా.. బాధిత విద్యార్థులు ఎవరికీ చెప్పలేదు. రెండు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న హర్ష, శివాజీ, కేతన్, ప్రసాద్ 8వ తరగతి విద్యార్థుల వీపులపై కర్రలతో దాడి చేయగా వాతలు పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బుధవారం పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్ దయాకర్ను నిలదీశారు. ఆర్సీవో విద్యులతకు సమాచారం అందించగా.. పాఠశాలకు చేరుకొని విద్యార్థులను విచారించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడి చేసిన నలుగురు విద్యార్థులను పది రోజులపాటు సస్పెండ్ చేశారు.