హైదరాబాద్ : స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశ్రీ టీవీ నారాయణకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. మాసబ్ ట్యాంక్లోని ఆయని నివాసంలో టీవీ నారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుడిగా, అణగారిన వర్గాలకు విద్య ఆవశ్యకతను తెలియజేసిన ఉద్యమకారుడిగా టీవీ నారాయణ ఎన్నో సేవలందించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
అంతేకాదు ప్రజాజీవితంలో ఉన్న అనేక మంది నవతరం నాయకులను టీవీ నారాయణ మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకై దీక్ష చేసేందుకు అందరినీ ఏకతాటిపై తెచ్చి టీవీ నారాయణ ప్రోత్సాహించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి టీవీ నారాయణ, వారి జీవిత భాగస్వామి సదాలక్ష్మి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. టీవీ నారాయణ లేని లోటును భర్తీ చేయలేమన్న ఎమ్మెల్సీ కవిత, వారి ఆశయాలను కొనసాగించేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయడమే వారికి పెద్ద నివాళి అని కవిత తెలిపారు.