యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27: కోరిన కోర్కెలు తీర్చే యాదగిరి నృసింహుడికి.. భక్తులకు సిరిసంపదలు ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారితో ముక్కోటి దేవతల సాక్షిగా బ్రహ్మోత్సవ తిరుకల్యాణ సుముహూర్త నిర్ణయ ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం సోమవారం రాత్రి నయనానందకరంగా సాగింది. ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాడ వీధు ల్లో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని సంప్రదాయరీతిలో నిర్వహించారు. భక్తజనుల జయజయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అలంకార నరసింహుడిని అశ్వ వాహనం పై ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారిని పశ్చిమ దిశకు అభిముఖంగా, అమ్మవారిని తూర్పు అభిముఖంగా ఎదురెదురుగా ప్రతిష్ఠించా రు. ఇరువైపులా అధికారులు, అర్చకులు, రుత్విక్కులు ఆసీనులై పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. అర్చక బృందం అమ్మవారి అందచందాలు, సుగుణాలను కీర్తించారు. అమ్మవారితో స్వామివారి కల్యాణం మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరుపడానికి ముహూర్తం నిశ్చయించారు. అలంకార సేవోత్సవంలో భాగంగా స్వామివారు సోమవారం ఉదయం జగన్మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
నేడు రాత్రి తిరుకల్యాణోత్సవం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి 9.30 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా జరిగే కల్యాణోత్సవం తూర్పు మాడ వీధుల్లో ఆగ్నేయ దిశలో నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ మండపాన్ని రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు. మండపం ఎదురుగా వీవీఐపీ, కల్యాణ భక్తులకు ప్రత్యేకమైన బారికేడ్లను, మండపం ఎదురుగా ఉన్న భక్తులతోపాటు ఉత్తర మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్పై భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా 8 ఎల్ఈడీ స్క్రీన్లను అందుబాటులో ఉంచారు. బ్రహ్మోత్సవాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో 325 మంది కల్యాణం నిర్వహించే భక్తులు పాల్గొననున్నారు.