మెదక్: మెదక్లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం (Edupayala Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూడు రోజులుగా వరద ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో దుర్గామాత ఆలయంలోకి భారీగా వరద ప్రహిస్తున్నది. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతుంది. ఈ నేపథ్యంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన చేశారు. పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు.
రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటుచేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. ఇక.. మంజీరాకు నక్క వాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.