రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చినట్టు వైద్యశాఖ అధికారులు నివేదికలిచ్చారు. జనసంచారం మామూలు స్థాయికి వస్తున్నది. విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడం వల్ల విద్యార్థుల్లో ముఖ్యంగా పాఠశాల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నది. అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నదన్న అధ్యయనాలను వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్రంలోని పరిస్థితులు, పూర్వాపరాలను పరిశీలించి, సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని నిర్ణయించాం.
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీలతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను ఈ నెల 30లోగా శానిటైజ్ చేయాలని పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల మంత్రులు, అధికారులకు సూచించారు. కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థల పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో వివిధశాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ టీచర్లు, విద్యారంగ అనుబంధ వ్యవస్థల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల పునఃప్రారంభానికి తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చినట్టు వైద్యశాఖ అధికారులు నివేదికలిచ్చారని, రాష్ట్రం లో జనసంచారం మామూలు స్థాయికి వస్తున్నదని పేర్కొన్నారు. విద్యా సంస్థలను నిరంతరాయంగా మూయడం వల్ల పాఠశాల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని, అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నదన్న అధ్యయనాలను వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్రంలోని పరిస్థితులు, పూర్వాపరాలను పరిశీలించి, సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలదే బాధ్యత
గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను పంచాయితీరాజ్, మున్సిపల్శాఖలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. పాఠశాలలు, విద్యాసంస్థల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లదేనని సీఎం పునరుద్ఘాటించారు. మరుగుదొడ్లు సహా విద్యాసంస్థల ప్రాంగణాలను సోడియంక్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రం చేయాలని సూచించారు. తరగతి గదులతోపాటు నీటి ట్యాం కులను కూడా తేటగా కడిగించి, శానిటైజ్ చేయించాలని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్షులు క్షేత్రస్థాయిలో పర్యటించి, విద్యాసంస్థల్లో శానిటైజేషన్ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు సైతం చొరవ తీసుకుని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.
జ్వరంతో ఉన్నవారికి కొవిడ్ పరీక్షలు
విద్యాసంస్థలు తెరిచిన తర్వాత విద్యార్థులకు జ్వరం తాలూకు లక్షణాలంటే, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వెంటనే సమీపంలోని పీహెచ్సీకి తీసుకెళ్ల్లి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఒకవేళ కొవిడ్ సోకినట్టు తేలితే ఆయా విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, మాసులను ధరించడం వంటి కొవిడ్ నియంత్రణ చర్యలను విధిగా పాటించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజూ పిల్లలు మాసులు ధరించేలా, కొవిడ్ నియంత్రణ విధానాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. సమావేశంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు స్మితాసబర్వాల్, రాజశేఖర్రెడ్డి, భూపాల్రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, సీఎం ఓఎస్డీలు గంగాధర్, ప్రియాంక వర్గీస్, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్రోస్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఓఎస్డీ పంచాయతీరాజ్ సత్యనారాయణరెడ్డి, మైనార్టీ గురుకులాల కార్యదర్శి షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.
స్వాగతించిన సంఘాలు
సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని పలు సంఘాలు స్వాగతించాయి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ఎస్జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఖమ్రెద్దీన్, టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి, తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజీల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాలని, శానిటైజేషన్కు నిధులు కేటాయించాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి కోరారు.
నేడు అధికారులతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా మంగళవారం మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయితీరాజ్, మున్సిపల్, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు 50 శాతం చొప్పున హాజరవుతున్నారు. ఇకనుంచి పూర్తిస్థాయిలో హాజరయ్యేలా ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీకానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 28వేల ప్రభుత్వ, 11 వేల ప్రైవేట్ పాఠశాలలు, 475 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లు, 900 గురుకులాలు, దాదాపు 2వేల జూనియర్ కాలేజీలు, 950 డిగ్రీ కళాశాలలు, 400 వృత్తి విద్యాకాలేజీలు తెరుచుకోనున్నాయి.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నియంత్రణ చర్యలు చేపట్టాలి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, ఆగస్ట్ 23 (నమస్తే తెలంగాణ): వానకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. సీజనల్వ్యాధులపై సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య, మున్సిపల్శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానితులకు తక్షణమే పరీక్షలు చేయించాలని, అం దుకు దవాఖానల్లో తగిన ఏర్పాట్లుచేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, మున్సిపల్శాఖ అధికారులకు సూచించారు. దోమల నివారణకు ప్రత్యే క కార్యాచరణ అమలుచేయాలని చెప్పారు.