వనపర్తి : విద్యార్థులు ఎంత గొప్ప చదువులు చదివినా అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో ప్రత్యేక పశు వైద్య శిబిరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు సృష్టిలో మేధోసంపతి గల జీవి అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం తరువాత పశుపోషణకు ప్రాముఖ్యత ఇస్తుందని వెల్లడించారు. మానవ సమాజం జీవరాశుల చుట్టూ అనుసంధానమై ఉందని మానవులకు అవసరమైన జీవులను పెంచాలని సూచించారు. మానవుల ఆహార మార్పులలో పశువులు చాలా అవసరమని అన్నారు.
పశుపోషణ ఉత్పత్తి పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్లో పశువైద్య ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.