హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉపాధ్యాయ విద్యాశిక్షణా కోర్సుల కాలేజీల్లో ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ బీఈడీ, ఎంఈడీ, యూజీ -డీపీడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల కాలేజీల్లో ఫీజులను నిర్ణయించింది. బీఈడీ కోర్సు ఫీజు గరిష్ఠంగా రూ. 47వేలు కాగా, కనిష్ఠంగా రూ. 16,500గా వెల్లడించింది. ఎంఈడీ కోర్సుకు గరిష్ఠంగా రూ.36 వేలు, కనిష్ఠంగా రూ.10వేల ఫీజుగా పేర్కొన్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం జీవో -110ని విడుదల చేశారు.
ఈ ఫీజులు 2022 -25 బ్లాక్ పీరియడ్కు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గతంలోనే విచారణ జరిపి, ఫీజుల సవరణ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ఈ నేపథ్యంలోనే ఆయా కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో 212 బీఈడీ కాలేజీలుండగా అత్యధికంగా కాలేజీల్లో ఫీజులు రూ.25 వేల నుంచి 30 వేల వరకున్నాయి.