Telangana | హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యా శాఖ అధికారులతో మంత్రి సబిత సమావేశమయ్యారు.
పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవలసిందిగా విద్యాశాఖ తరపున వ్యక్తిగతంగా మెసేజ్లు పంపాలని ఆదేశించారు. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీఎస్ ఆన్లైన్ అధికారులను సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.
జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని ఆదేశించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.