హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పీఎం శ్రీ స్కూల్స్ పథకం అమలుకు ఎంపికైన ఎంపికైన బడుల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల కల్పనా సంస్థ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) ద్వారా ఈ పనులు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శనివారం నిధులనూ మంజూరు చేశారు. 114 బడుల్లో 252 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.40.32 కోట్లను కేటాయించారు.
ఒక్కో తరగతి గదిని రూ.16 లక్షలతో నిర్మించనున్నారు. మరో 279 బడుల్లో సైన్స్ ల్యాబ్లను ఏర్పాటుకు రూ.44.64 కోట్లు మంజూరుచేశారు. ఒక్కో ల్యాబ్కు రూ.16 లక్షల చొప్పున ఖర్చుచేస్తారు. ఇవేకాకుండా మరో 205 బడుల్లో మేజర్ మరమ్మతుల కోసం రూ.9.22 కోట్లను మంజూరుచేశారు.