వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బడ్జెట్లోనూ వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా బడ్జెట్ను కేటాయించారని అన్నారు.
జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి నాలుగుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. వరంగల్ను హెల్త్సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, సుమారు 11 వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. ఎంజీఎం ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాల వల్ల ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ప్రైవేట్ వైద్యులు వ్యాపార దృక్ఫథమే గాక సేవా దృక్ఫథంతో పేదలకు సేవ చేయాలని సూచించారు. వరంగల్ నగరం ఐటీ, టెక్ట్స్టైల్స్ పార్కులు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మా రావు తదితరులు ఆస్పత్రిలోని పలు విభాగాలను ప్రారంభించారు.