MLC Kavitha | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 9నే విచారణకు రావాలని కవితకు సమన్లు జారీచేసినప్పటికీ ముందే ఖరారైన కార్యక్రమాల దృష్ట్యా మరో రోజు హాజరవుతానని, చట్టాల పట్ల తనకు గౌరవం ఉన్నదని ఆమె ఈడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత.. ఈ దీక్ష అనంతరం విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె శనివారం ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కాగా, ఎమ్మెల్సీ కవితకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. కవితకు సంఘీభావంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు, భారత జాగృతి సంస్థ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు.