హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ)/కడ్తాల్: హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ కేసులో సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇండ్లలో ఈడీ సోదాలు కొనసాగినట్టు సమాచారం. హైదరాబాద్తోపాటు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ప్రవీణ్ ఫాంహౌస్లో కూడా సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. బోయిన్పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో, ఐఎస్సదన్లోని ప్రవీణ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, ఇతర ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. గోవాలో బిగ్డ్యాడీ పేరిట క్యాసినో నిర్వహించే ప్రవీణ్, మాధవరెడ్డి కలిసి గత నెల 10 -13 తేదీల మధ్య ఇండో-నేపాల్ సరిహద్దులోని సిలిగురి ప్రాంతంలో ‘ఆల్ ఇన్’ పేరిట క్యాసినో నిర్వహించారు. ఇందుకోసం జూదగాళ్లను శంషాబాద్ విమానాశ్రయం నుంచి బాగ్డోగ్రాకు ప్రత్యేక విమానాల్లో తరలించినట్టు తెలిసింది. విమాన చార్జీలు, హోటల్లో బస, భోజనం, డ్రింక్స్, ఇతర ఎంటర్టైన్మెంట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. నేపాల్, థాయ్లాండ్లోని ఓ ఐలాండ్లోనూ క్యాసినోలు ఏర్పాటు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో డబ్బంతా హవాలా మార్గంలోనే తరలించినట్టు తేల్చారు.