Vivek | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత, చెన్నూరు అభ్యర్థి జీ వివేకానంద (వివేక్) అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో తన ధన రాజకీయాన్ని చలాయించాలనుకున్న వివేక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఆయన చేస్తున్న కోట్ల రూపాయల మోసాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఆయన హెచ్డీఎఫ్సీ అకౌంట్ నుంచి జరిగిన రూ.8 కోట్ల నగదు బదిలీపై రాష్ట్ర పోలీసులు ఇచ్చిన సమాచారంతో కూపీలాగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అతని దొంగ కంపెనీల నుంచి జరిగిన రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. దీంతో వివేక్పై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఈడీ అధికారులు బుధవారం పత్రికా ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలోని మంచిర్యాల, హైదరాబాద్లోని హైటెక్సిటీ, సోమాజిగూడ, రామగుండంలో వివేక్కు చెంది ఇండ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈడీ అధికారులు తెలిపారు.
వివేక్కు చెందినవిగా చెప్తున్న హైదరాబాద్లోని విశాఖ ఇండస్ట్రీస్, రామగుండానికి చెందిన విజిలెన్స్ సెక్యూరిటీస్ నుంచి కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీటిల్లో ఎటువంటి వ్యాపార హేతుబద్ధత లేకుండానే తరచుగా సుమారు 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. ఈ డబ్బు కూడా విజిలెన్స్ సెక్యూరిటీ రాబడి కాదని వెల్లడించారు. అయితే ఈ సంస్థ నుంచి వీరికి వ్యాపారం ద్వారా కేవలం రూ.20 లక్షల ఆదాయం మాత్రమే వచ్చిందని, ఆస్తులు, అప్పులు కలిపి మొత్తం రూ.64 కోట్లకు బ్యాలెన్స్ షీట్ ఉందని గుర్తించారు. కానీ సుమారు రూ.200 కోట్లకుపైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు తాము గుర్తించామని వెల్లడించారు. ఈ రెండు కంపెనీలను కాంగ్రెస్ నేత వివేక్ ప్రత్యక్షంగా, పరోక్షంగా నియంత్రిస్తున్నట్టు ఈడీ పేర్కొన్నది. అయితే, ఈ విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ లావాదేవీల్లో వివేఖ సోదరుడు గడ్డం వినోద్ పాత్ర కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో వివేక్కు చెందిన విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చారు. ఈ సెక్యూరిటీ సంస్థకు యశ్వంత్ రియల్టర్స్ మాతృసంస్థగా ఉందని గుర్తించారు. ఈ యశ్వంత్ రియల్టర్స్లో ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఇన్నాళ్లూ తన అధికారాన్ని ఉపయోగించి, ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశంలో వివేక్ వ్యాపార సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సోదాల్లో వివేక్ భార్య పేరుపై, యశ్వంత్ రియల్టర్స్ పేరు మీద భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో ఎన్నో అనుమానాస్పదమైన ఆస్తుల డాక్యుమెంట్లు, లెక్కకురాని లావాదేవీల పత్రాలు, కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లు, చట్టబద్ధం కాని ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లు, వాటిపేరుపై ఉన్న భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. వీటితోపాటు భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈడీ అధికారుల దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీని ఓ బోగస్ సంస్థగా ఈడీ అధికారులు తేల్చారు. వివేక్పై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.
వివేక్, వినోద్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)ను అడ్డాగా చేసుకొని అనేక అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా వివిధ హోదాల్లో పనిచేసిన గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇండ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఎస్ఎస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం, దాని ఎండీ సత్యనారాయణ ఇండ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. అక్కడ లభించిన డిజిటల్ పరికరాలు, విలువైన పత్రాలను పరిశీలించగా లెకలో చూపని రూ.10.39 లక్షలు వెలుగులోకి వచ్చాయి. వాటి కోసం వినోద్కు చెందిన ఓ ప్రాంతంలో వెతకగా అన్నదమ్ములిద్దరూ హెచ్సీఏను అడ్డాగా చేసుకొని అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడైంది.
ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై రాష్ట్ర ఏసీబీ వేసిన 3 చార్జిషీట్ల ఆధారంగా ఈడీ కూపీ లాగింది. దీంతో డీజీ సెట్లు, అగ్నిమాపక సామగ్రి, క్యానోపీల కొనుగోలులో తీవ్ర అవకతవకలు జరిగాయని గుర్తించింది. స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులు విపరీతమైన జాప్యం కారణంగా ఖర్చులు, నిర్మాణ వ్యయం పెరిగి హెచ్సీఏకు నష్టాలు వచ్చినట్టు గుర్తించారు. నాటి హెచ్సీఏ సెక్రటరీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆఖరికి ఆఫీస్ బేరర్లు సైతం కుమ్మక్కు కావడంతో ఇష్టారాజ్యంగా టెండర్లు దకించుకుని మారెట్ ధరల కంటే ఎకువ ధరలు చూపి, కాంట్రాక్టర్లకు పనులు కేటాయించినట్టు వెల్లడైంది. రశీదు కంటే ముందే కొటేషన్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో చాలామంది కాంట్రాక్టర్లకు ముందస్తుగా కోట్లాది రూపాయలు చెల్లింపులు జరిగినా వారి ద్వారా ఎలాంటి పనులు జరగలేదని వెల్లడైంది. హెచ్సీఏలో జరిపిన సోదాల్లో విశాఖ ఇండస్ట్రీస్, దాని గ్రూప్ కంపెనీలు, వారి రియల్ ఎస్టేట్ కార్యకలాపాల లొసుగులు బయటపడ్డాయి. వీటిపై లోతుగా విచారణ జరుగుతుందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అధికారులు చెప్పారు.