MLC Kavitha |హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసును కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎమ్మెల్సీ కవితకు బలవంతంగా అంటగట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నది. ఈ కేసులో డాక్యుమెంట్ రూపంలో ఎక్కడా కవిత పేరు లేకపోయినప్పటికీ కేవలం నిందితులు చెప్పిన మాటల ఆధారంగానే ఈ నెల 11న ఈడీ అధికారులు ఆమెను విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా మహిళను 9 గంటల పాటు ఈడీ కార్యాలయంలో విచారించడం, సూర్యాస్తమయం తరువాత కూడా విచారణ కొనసాగించడం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం వివాదస్పదమయ్యాయి.
ఈడీ ద్వారా కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదనే విమర్శలున్నాయి. 9 గంటలపాటు విచారించినా కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలూ దొరకలేదు. గురువారం విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఇదే కేసులో ఈడీ అదుపులో ఉన్న అరుణ్ రామచంద్రపిైళ్లె కస్టడీని కావాలనే మరో మూడు రోజులకు పొడిగించింది. అందుకు కారణం.. గురువారం కవిత తమ విచారణకు హాజరుకాకపోవడమేనని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమె పేరును అనుమానితురాలిగా ప్రస్తావించిన ఈడీ అధికారులు.. ఈ నెల 20న మళ్లీ విచారణకు రావాలని నోటీసులు పంపించారు. అయితే, మొదటి నుంచి తనను బలవంతంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వాదిస్తున్నారు.
మద్యం పాలసీ కేసులో రామచంద్ర పిైళ్లె ఇప్పటికే 36 సార్లు ఈడీ, సీబీఐ విచారణలు ఎదుర్కొన్నారు. మరోవైపు మాగుంట శ్రీనివాసులరెడ్డికి నోటీసులు జారీ చేశారు. 17న మరోసారి బుచ్చిబాబును ప్రశ్నించాల్సి ఉన్నదని, పిైళ్లె కస్టడీ మూడ్రోజులు పొడిగించాలని సీబీఐ కోర్టుకు తెలిపింది. కేసుతో సంబంధంలేని ఎమ్మెల్సీ కవితను నిందితులుగా ఉన్న వారితో కలిపి విచారించేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నది. పిైళ్లె కస్టడీని పొడిగించడంతోపాటు కవితను 20న ప్రత్యక్షంగా హాజరుకావాలని కోరడమే ఇందుకు నిదర్శనం. సీబీఐ కోర్టుకు ఈడీ నివేదించిన అంశంలో ఆంతర్యం కూడా ఇదే. ‘అనుమానితురాలిగా ఉన్న కవిత ఈ రోజు (గురువారం) విచారణకు రాలేదని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి పిైళ్లె కస్టడీని పొడిగించాలి’ అని ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టును కోరారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసు తదుపరి విచారణను 20కి వాయిదా వేసింది.