హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టడంతో ఈడీ దిగొచ్చింది. ఈ నెల 30న రోహిత్రెడ్డి నుంచి అదనపు సమాచారాన్ని సేకరించబోమని హామీ ఇచ్చింది. దీంతో పీఎంఎల్ఏ కేసు దర్యాప్తు నిలిపివేతకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా రోహిత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్రెడ్డి వాదిస్తూ.. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై రోహిత్రెడ్డి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని, దాని ఆధారంగా ఫిర్యాదుదారుడిపైనే ఈడీ కేసు నమోదు చేయడం దారుణమని తెలిపారు. రోహిత్రెడ్డిపై కేసు నమోదు చేసేలా కొందరు ఈడీని ఉసిగొల్పారని, వారి చేతిలో ఈడీ, సీబీఐ పెంపుడు చిలకల్లా మారాయని పేర్కొన్నారు.
హద్దు మీరిన ఈడీ
అసలు ఈ వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేసేందుకే ఆస్కారం లేదని, అయినా ఈడీ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నదని, పిటిషనర్ను లక్ష్యంగా చేసుకొని విచారణ చేయడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదని నిరంజన్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. టీఆర్స్ (బీఆర్ఎస్)కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలంటూ తనకు ఎవరో రూ.100 కోట్లు ఆఫర్ చేయడంపై ఎమ్మెల్యే రోహిత్రెడ్డి నిజాయితీగా పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఆ పాపానికి ఫిర్యాదుదారుడిపైనే ఈడీ కేసు నమోదు చేయడం, ఆయనతోపాటు కుటుంబసభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాల విరాలను కోరడం చట్టవ్యతిరేకమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, అయినా ఆ వ్యవహారంలో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం జరగనందున మనీ లాండరింగ్ కేసు నమోదు చేయడం చెల్లదని తెలిపారు.
ఇప్పటికే రెండుసార్లు విచారించి..
ఈ కేసులో ఈడీ ఇప్పటికే రెండు రోజులు పిటిషనర్ను విచారించి ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యుల వ్యక్తిగత, ఆదాయ వివరాలను కోరిందని, అంతటితో ఆగకుండా ఈ నెల 30న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించడంతో ఈ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరామని నిరంజన్రెడ్డి వివరించారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. ‘ఈడీ అడుగుతున్న వివరాలన్నింటినీ పిటిషనర్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొంటారు కదా? ఆ వివరాలను మళ్లీ ఇస్తే తప్పేమిటి?’ అని ప్రశ్నించారు. దీంతో అసలు నేరపూరిత సొమ్మే లేనప్పుడు ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదన్నది తమ ప్రధాన ఉద్దేశమని నిరంజన్రెడ్డి జవాబిచ్చారు. దీంతో ఆ కోణంలో విచారణ చేపడతామని ప్రకటించిన జస్టిస్ లక్ష్మణ్.. పిటిషనర్ నుంచి అదనంగా ఏమైనా సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నదా అని ఈడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. పిటిషనర్ నుంచి తదపరి వివరాలు సేకరించబోమని ఈడీ తరఫు న్యాయవాది చెప్పడంతో పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన జస్టిస్ లక్ష్మణ్.. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 5కి వాయిదా వేశారు.