సూర్యాపేట, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పరిధి దాటి వ్యవహరిస్తున్నదని, చట్టప్రకారం విచారణ జరపడం లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ఓ మహిళను రాత్రి వరకు విచారించడమంటే అది ముమ్మాటికీ వేధించడమేనని, రాజకీయ కక్షసాధింపు చర్యగా భావించాల్సి ఉంటుందని తెలిపారు.
బీజేపీ నాయకుల ఆలోచనలు, ప్రకటనల ఆధారంగానే ఈడీ పని చేస్తున్నదని విమర్శించారు. విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తుండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. నిబంధలకు విరుద్ధంగా విచారణ పేరుతో ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారని, విచారణ క్రమంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు.