హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): దేశంలో సార్వత్రి క ఎన్నికలు నిర్వహిస్తున్నది ఈసీ కా దు ఈడీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తె లంగాణ భవన్లో గురువారం క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజుల్లో అనేకమంది ప్రతిపక్ష నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చి, అరెస్టులు చేసిందని చెప్పారు. బీజేపీ ప్రత్యర్థులు పోటీ చేయకుండా మొత్తం ఈడీ కేసుల మీదనే దృష్టి పెట్టే విధంగా నోటీసులు జారీ చేస్తునారని ఆరోపించారు. ఎన్నికల్లో మోదీ తరఫున బౌలింగ్, బ్యాటింగ్ ఈడీదేనని వ్యాఖ్యానించారు. ఈడీ, ఐటీ, సీబీఐ మోదీ టీమ్లో అటగాళ్లు అని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదన్నది ప్రధాని మోదీ కుట్ర అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అన్న అంశం లోక్సభ ఎన్నికల ఎజెండాగా ఉండరాదన్నది బీజేపీ ఆలోచన అని చెప్పారు. అందుకే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. బీజేపీకి 400 సీట్లు వచ్చే ధీమా ఉంటే ఈడీ దాడులు, నోటీసులు ఎందుకని ప్రశ్నించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీపార్టీ ధర్నాలు చేస్తున్నదని, ఆ పార్టీ నేతలు ఎన్నికల్లో పనిచేయకుండా నిలువరించడంలో బీజే పీ సఫలమైందని క్రిషాంక్ అన్నారు. ఈడీ నోటీసులు అందుకున్న వారి లో ప్రముఖ నేతలు ఉన్నారని చెప్పారు. కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణ, ఆర్జేడీ నేత సుభాష్, టీఎంసీ నేత మహువా మొయిత్రా, కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా వంటి ప్రముఖులకు ఈడీ నోటీసులు అందాయని చెప్పారు. శివసేన పార్టీ టికెట్ ఇచ్చిన అమోల్ కీర్తికర్కు కొన్ని గంటల్లోనే ఈడీ తాఖీదులు పంపిందని తెలిపారు. డీఎంకే ఎంపీ రాజాకు సీబీఐ నోటీసులిచ్చిందని, సమాజ్వాదీ ఎమ్మెల్యేకు చెందిన రూ.26 లక్షలు జప్తు చేసుకొని నోటీసులు ఇచ్చారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈడీ విచారణలో పాల్గొనేలా నాయకులను ఎంగేజ్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీలో చేరి లొంగిపోయిన వారికి అరెస్టులు లేవని చెప్పారు. లొంగకుండా పోరాడుతున్న వారిపై వేధింపులు, దాడులు, కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీ ఈడీ ఆధ్వర్యంలో వెబ్ సీరిస్ నడుపుతున్నారని మన్నె క్రిషాంక్ ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ లేదు అంటున్న కిషన్రెడ్డి, తమ పార్టీ నేతలను చేర్చుకొని ఎందుకు టికెట్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే మోదీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని ఈడీ కార్యాలయం ముందు పెట్టారని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలనేది ఈడీ నిర్ణయిస్తున్నదని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.