మానకొండూర్, డిసెంబర్ 2: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ పెద్దలకు కొమ్ముకాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీ, ఐటీలను రాజకీయ కక్ష సాధింపునకు వాడుకుంటున్నదని ఆరోపించారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ సర్కారును గద్దె దించేందుకు ‘బీజేపీ హఠావో .. దేశ్కో బచావో’ నినాదం స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్లో నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. బీజేపీ హయాంలో దేశంలో మతోన్మాదం పెచ్చుమీరుతున్నదని మండిపడ్డారు. పాలనను గాలికి వదిలి విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నదని దుయ్యబట్టారు.