Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా హామీలు గుప్పిస్తున్నది. అమలు సాధ్యమా? కాదా? అన్న విచక్షణ మరిచి ప్రజల నెత్తిపై హామీలు కుమ్మరించేస్తున్నది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదంటే ఆశ్చర్యం అనిపించకమానదు. ఈ హామీలు అమలు చేయాలంటే మొత్తంగా రూ.2.9 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఆ హామీలు అమలు చేయాలంటే అదనంగా రూ.13 వేల కోట్లు కావాలి. బడ్జెట్ మొత్తాన్ని హామీలకే ఖర్చు చేస్తే ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ ఖర్చులు తదితర వాటి సంగతేంటన్న ప్రశ్న తలెత్తుతున్నది. కాంగ్రెస్ పార్టీ హామీలపై ఆర్థిక నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు అసాధ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండానే హామీలు ఇవ్వడం సరికాదని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హామీల అమలుకు కావాల్సిన నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తారు? వంటి అంశాలపై కసరత్తు చేయకుండానే హామీలు ప్రకటించడం సరికాదని చెప్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ను మించి హామీలివ్వడాన్ని తామెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హామీల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని, అమలుకు ప్రయత్నిస్తే వ్యవస్థలు కుప్పకూలిపోతాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలు గుడ్డిగా ఇటువంటి హామీలను నమ్మితే భవిష్యత్తులో గోసపడక తప్పదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, పింఛన్ల పెంపు ప్రకటించింది. వీటికితోడు ఆదివారం ఆరు గ్యారంటీలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిక్లరేషన్లలో పేర్కొన్న హామీలతో పాటు ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎంత మొత్తం ఖర్చవుతుందనే దానిపై ఆర్థిక నిపుణులు అంశాల వారీగా లెక్కలు వేశారు. దీని ప్రకారం పింఛన్ల కోసం రూ.39 వేల కోట్లు, ఇంటికి రూ.5 లక్షల స్కీం కోసం రూ.55 వేల కోట్లు, దళితబంధు, మూడు కార్పొరేషన్ల కోసం రూ.45 వేల కోట్లు, ఎస్టీల కోసం రూ.28 వేల కోట్లు, తండాలకు ప్రత్యేక నిధుల కోసం రూ.1,250 కోట్లు, రైతు భరోసా, కౌలు రైతులు, కూలీల కోసం రూ.69 వేల కోట్లు, మహిళా సంక్షేమం కోసం రూ.39 వేల కోట్లు, ఉద్యోగ కల్పన, వారి వేతనాల కోసం రూ.6 వేల కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ. 7,500 కోట్లు అవసరమని తేల్చారు. ఈ పథకాల అమలు కోసం మొత్తం రూ. 2.9 లక్షల కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చారు. మరోవైపు, కాంగ్రెస్ హామీలు హంబక్కేనని గ్రహించిన ప్రజలు కూడా వీటిపై పెద్దగా స్పందించడం లేదు. హామీలతో ఎంతో స్పందనను ఊహించిన కాంగ్రెస్కు ప్రజల నుంచి స్పందన కరువవడంతో అంతర్మథనంలో పడింది. తామెంతో కసరత్తు చేసి గ్యారెంటీలు ప్రకటిస్తే ప్రజలు చప్పుడు చేయకపోవడంతో కాంగ్రెస్ నేతలు డీలాపడిపోయారు.