జహీరాబాద్, ఆగస్టు 14: సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఉత్తమాటలు కాకుండా నిధులు మంజూరు చేసి చూపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాం డ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధే తప్పా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్ల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ 73కోట్లు, ఆర్అండ్బీశాఖ ద్వారా రూ 30కోట్లు మంజూరు చేసిన నిధులను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు చేయగా, రూ. 25 కోట్ల మేరకు అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. మిగిలిన రూ. 25 కోట్లను కూడా ప్రభుత్వం నిలిపివేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మూడున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. జహీరాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంగమేశ్వర ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల జహీరాబాద్ ప్రాంత అభివృద్ధి పనులు, పలు సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు కలిసి వినతి పత్రాలు అందిస్తే వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జహీరాబాద్ ప్రాంత సమస్యలు ప్రస్తావించినప్పుడల్లా సంబంధిత అధికారులు నోట్ చేసుకుంటామని సంబంధిత మంత్రులు సమాధానం చెప్పడం బాధాకరమన్నారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తట్టునారాయణ, నర్సింహులు, సంజీవ్రెడ్డి, వెంకటేశం, కౌన్సిలర్లు దీపక్, మహిపాల్, ప్రవీణ్, నాయకులు గండప్ప, విజయ్కుమార్, నరసింహగౌడ్, సురేశ్, శివప్ప పాల్గొన్నారు.