హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. అటవీమార్గంలో ప్రమాదాల బారి నుంచి మూగజీవాలను కాపాడేందుకు సంకల్పించింది. అటవీప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలతో తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు గురై మృత్యువాతపడుతున్నాయి. మూడు నెలల క్రితం అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని శ్రీశైలం ప్రాంతంలో రోడ్డుపై చిరుత మృతిచెందింది.
వికారాబాద్ ఏరియాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత ప్రాణాలొదిలింది. మొన్న మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై మచ్చల జింక దుర్మరణం చెందింది. ఇలాంటి ఘటనలను రాష్ట్ర అటవీశాఖ దృష్టిలో పెట్టుకొని, అటవీ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై ఓవర్ పాస్ పర్యావరణ వంతెనలను నిర్మించాలని నిర్ణయించింది. అందులోభాగంగా 63వ జాతీయ రహదారిలో భాగమైన మంచిర్యాల చంద్రాపూర్ రోడ్డులోని వాంకిడి సమీపంలో దేశంలోనే రెండో ఓవర్పాస్ పర్యావరణ వంతెన (బ్రిడ్జి) రాబోతున్నది. వన్యప్రాణుల అనుసంధానాన్ని పెంపొందించే లక్ష్యంతో పర్యావరణ వంతెనలను నిర్మించనున్నారు. అడవి జంతువులు బ్రిడ్జి మీదుగా వెళ్తాయి. బ్రిడ్జి కిందినుంచి వాహనాల రాకపోకలు సాగుతాయి.
కి.మీ.పొడవుతో ఓవర్పాస్ వంతెన
అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. పెంచ్ టైగర్ రిజర్వులోనూ ఇదే తరహా వంతెన నిర్మించారు. కాగజ్నగర్ అడవుల్లోని మంచిర్యాల-చంద్రాపూర్ మార్గం పర్యావరణపరం గా సున్నిత ప్రాంతం. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వలసవచ్చే సమయంలో పులులు సాధారణంగా ఈ మార్గం నుంచి వెళతాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) సుమారు 1 కి.మీ పొడవుతో ఓవర్ పాస్ వంతెనను నిర్మిస్తున్నది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం రూ.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన ఆరు నెలల్లో వినియోగంలోకి రానున్నదని రాష్ట్ర అటవీశాఖ సీనియర్ అధికారి తెలిపారు. వన్యప్రాణులు సౌకర్యవంతంగా రహదారిని దాటడానికి వీలుగా ఓవర్పాస్ వంతెనను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.