హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. గతంలో రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తును మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి తిరిగి కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది. గుర్తుల కేటాయింపు లో నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును బదిలీ చేసింది. ఆయన స్థానంలో హుటాహుటిన మిర్యాలగూడ ఆర్డీ వో రోహిత్సింగ్ను రిటర్నింగ్ అధికారిగా నియమించింది. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ బుధవారమే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతోపాటు ‘యుగ తులసి పార్టీ’ అభ్యర్థి కే శివకుమార్కు ఈనెల 17న జగన్నాథరావు కేటాయించిన ‘బేబీ వాకర్’ గుర్తును రద్దు చేసింది. తాజాగా సదరు అభ్యర్థికి ‘రోడ్డు రోలర్’ గుర్తును కేటాయించారు. రోడ్డు రోలర్ గుర్తుతో బ్యాలెట్ పేపర్లను (ఫారం-7ఏ) కూడా ముద్రించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ‘యుగ తులసి పార్టీ’ అభ్యర్థిగా పోటీచేస్తున్న కే శివకుమార్ గుర్తు విషయంలో తలెత్తిన వివాదంపై వివరణ ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని, రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన జగన్నాథరావును సీఈసీ ఆదేశించింది.
అసలేం జరిగింది?
ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఈ నెల 17న ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తులు కేటాయించారు. ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన గుర్తుల్లోనుంచి బరిలో ఉన్న 47 మంది అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 47 మంది అభ్యర్థుల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు రాగా.. మిగిలిన వారికి ఇతర గుర్తులు కేటాయించారు. ఈ క్రమంలో యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ తనకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని అడిగారు. టీఆర్ఎస్ పార్టీ రోడ్డు రోలర్ గుర్తుపై గతంలోనే అభ్యంతరం వ్యక్తంచేసింది. 2011 లోనే రోడ్డు రోలర్ గుర్తును కేంద్ర ఎన్నికలసంఘం తొలగించిందని, దీనిపై తమ పార్టీ అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని, కారును పోలిన 8 గుర్తులను మినహాయించి మిగిలిన గుర్తులు కేటాయించుకోవచ్చని ఎన్నికల అధికారులకు పార్టీ సూచించిం ది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అక్కడ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రోడ్డు రోలర్ గుర్తు స్థానంలో బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. దీనిపై శివకుమార్ సీఈసీకి ఫిర్యా దు చేశారు. వాస్తవానికి ఆర్వో నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. కానీ, ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం తన విశేష అధికారాలను ఉపయోగించి ఆర్వో నిర్ణయం సరికాదని, శివకుమార్ కోరుకున్నట్టు ఆయనకు స్వతంత్ర గుర్తుల్లో నుంచి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని ఆదేశించడమే కాకుండా.. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును కూడా విధుల నుంచి తొలగించింది. వాస్తవానికి జగన్నాథరావును గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. కానీ, ఆయనను బుధవారం మధ్యాహ్నంలోపే విధుల నుంచి తొలగించడమే కాకుండా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ను హుటాహుటిన రిటర్నింగ్ అధికారిగా నియమించడంతోపాటు తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేయడం గమనార్హం.
బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తున్నదా?
రద్దుచేసిన గుర్తు కేటాయింపుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదనడానికి మునుగోడు ఉప ఎన్నికే తార్కాణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2011లో కేంద్ర ఎన్నికల సంఘం తాను రద్దుచేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి కేటాయించడం, ఆర్వో జగన్నాథరావు బదిలీపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరు ఆక్షేపణీయమన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దంపట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనన్నారు. రోడ్డు రోలర్ గురించి తాము అనేకమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అభ్యర్థించామని, తమ అభ్యర్థన మేరకు రోడ్డురోలర్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిందని, కానీ, ఈసారి ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి రోడ్డురోలర్ గుర్తును కేటాయించేలా బీజేపీ ఉత్తర్వులు ఇప్పించిందని మండిపడ్డారు. టీఆర్ఎస్కు చెందిన కారు గుర్తును పోలిన గుర్తు రోడ్డురోలర్ బ్యాలెట్ పేపర్పై ఉంటే ఓటర్లను అయోమయానికి గురిచేయవచ్చన్న తన ఎజెండాను కేంద్ర ఎన్నికల సంఘంతో బీజేపీ అమలు చేయించిందన్నారు. నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని తెలిపారు. బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. నిబంధనల మేరకు పనిచేసిన మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి బదిలీపైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మునుగోడులో ఓటమి తప్పదనే బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం.. బీజేపీ నాయకత్వంలో పనిచేయడం శోచనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు.