Komati Reddy | మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల మూడో తేదీన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కోమటిరెడ్డి పలువురు వ్యక్తులు సంస్థలకు నగదు బదిలీ చేశారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ చేసిన ఫిర్యాదుపై ఆదివారం ఈసీ స్పందించింది.
రూ.5.24 కోట్ల నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం నాలుగు గంటల్లోగా సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో ఈసీ స్పష్టం చేసింది. ఈ విషయమై సమాధానం ఇవ్వకుంటే తగు నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.
సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి నగదు బదిలీ చేసినట్లు ఈసీకి ఆధారాలతో టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి ఓటర్లకు పంచడానికే ఈ నగదు బదిలీ చేశారని ఆ ఫిర్యాదులో టీఆర్ఎస్ పేర్కొంది.
కోమటి రెడ్డి అక్రమంగా నగదు బదిలీ చేశారని వచ్చిన ఆరోపణలపై నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. తాము జారీ చేసిన నోటీసులను ఆలస్యం లేకుండా రాజగోపాల్ రెడ్డికి అంద జేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో), మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది.