హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సంఘం ఆమోదం లేకుండా ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ప్రకటనలు ఇచ్చినందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ఇన్చార్జి కార్యదర్శిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24 నుంచి 27 వరకు వరుసగా వివిధ పత్రికల్లో ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలపై బీఆర్ఎస్, బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం సోమవారం స్పందించింది.
ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకి వస్తుందని స్పష్టం చేసింది. అక్టోబరు 9న దీనికి సంబంధించిన ఆదేశాలను అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా చేరవేసినట్టు పేర్కొన్నది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు తెలంగాణలో ప్రకటనలు జారీ చేయవద్దని కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదని స్పష్టం చేసింది. ఎన్నికలు లేని రాష్ర్టాలు ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ప్రకటనలు ఇవ్వాలనుకొంటే ముందుగా ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించింది.