హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో కారును పోలిన ఐదు గుర్తులను ఈసీ కేటాయించింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన వెంటనే అక్టోబర్ 10న కారును పోలిన గుర్తులను ఎవరికీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 14న మరో వినతిపత్రం ఇచ్చింది. అందులో కెమెరా, చపాతి రోలర్, డోలీ (పల్లకి), రోడ్రోలర్, సబ్బుపెట్టె, టీవీ, కుట్టుమిషన్, బోటు గుర్తులు ఎవరికీ కేటాయించ వద్దని కోరింది. కానీ వీటిలో షిప్ (బోటు), చపాతి రోలర్, టీవీ, కెమెరా గుర్తులను వివిధ అభ్యర్థులకు ఈసీ కేటాయించింది.
కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను తొలిగించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ఎన్నికల కమిషన్ను మరోసారి కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుడు అనూప్ చంద్ర పాండేతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కారును పోలిన గుర్తులను కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పక్షాన లేఖను అందించారు. కారును పోలి ఉన్న కెమెరా, చపాతి రోలర్, షిప్, రోడ్రోలర్ వంటి పలు గుర్తులను మునుగోడు ఉప ఎన్నికల పోటీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. 2011లో రోడ్ రోలర్ గుర్తును తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందు లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి ఏ శంకరాచారి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రిజిస్టర్డ్ పార్టీల నుంచి 10 మంది అభ్యర్థులు, స్వతంత్రులు 33 మంది పోటీలో ఉన్నారు.
టీఆర్ఎస్పై దివాలాకోరు ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను టీఆర్ఎస్ నేతలు కోరారు. మునుగోడు ప్రచారంలో కోడ్ ఉల్లం ఘనలకు పాల్పడుతున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం టీఆర్ఎస్ నేతలు సోమ భరత్కుమార్, దేవీప్రసాద్, రమేశ్రెడ్డి మంగళవారం డిప్యూటీ సీఈవో సత్యవాణికి ఫిర్యాదు చేశారు. అనంతరం భరత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ డబ్బులు తీసుకొని ఓట్లు వేయాలని బీజేపీ నేతలు ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. గెలువలేమన్న నిరాశ, నిస్పృహలతోనే బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికలు ప్రజాభీష్టానికి అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవడంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విఫలమయ్యారని టీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యా యవాది శ్రీరఘురాం మంగళవారం హైకోర్టులో వాదించారు. టీఆర్ఎస్ ఎన్నికల చిహ్నం కారును పోలిన ఎనిమిది గుర్తుల్ని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరితే ఈసీ నుంచి కనీస స్పందన లేదని తప్పుపట్టారు. కారును పోలినట్టుగా ఉన్న గుర్తులను మునుగోడు ఉప ఎన్నికల్లో స్వ తంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని ఈసీకి వినతిపత్రం ఇస్తే జవాబు లేదన్నారు. ఇప్పుడు కేసు విచారణ మొదలైన తర్వాత హైకోర్టులో మా వినతిపత్రాన్ని తిరస్కరించినట్లుగా ఈసీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఈ అంశంపై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 8 గుర్తుల గురించి శ్రీరఘురాం చెప్తుంటే.. చీఫ్ జస్టిస్ ఆ గుర్తుల బొమ్మలను చూస్తూ, వాటిలో చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయని, కుట్టుమిషన్, షిప్, టీవీ, డోలీ గుర్తులు కారులా కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శ్రీరఘురాం కల్పించుకుని అంగుళం కంటే తక్కువ సైజులో ఈవీఎంలో ఉండే గుర్తును ఓటర్లు సెకన్లపాటు మాత్రమే చూస్తారని, దీంతో ఓటర్లల్లో గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. ఎన్నికల చిహ్నాలపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడతాయని, చదువుకోని వారే కాకుండా చదువుకున్న వాళ్లు సైతం గుర్తులపై ఆధారపడి ఓట్లు వేస్తారని తెలిపారు. 2008లో సుబ్రమణ్యస్వామి కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పార్టీ ఎన్నికల చిహ్నంతో భావోద్వేగ అనుబంధం ఉంటుందని కూడా చెప్పిందని గుర్తుచేశారు. ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టుల జోక్యానికి వీల్లేదన్నారు. గతంలో మూడు గుర్తులపై టీఆర్ఎస్ అభ్యంతరం చెబితే, ట్రక్, ఐరెన్ బాక్స్లను ఈసీ తొలగించినట్టు తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది.